Page Loader
Stock market today: వరుసగా ఐదోరోజు నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు 
వరుసగా ఐదోరోజు నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Stock market today: వరుసగా ఐదోరోజు నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 13, 2024
04:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ ఈక్విటీ మార్కెట్‌ సూచీలు ఈ రోజు భారీ నష్టాల్లో ముగిశాయి. విదేశీ మదుపర్ల అమ్మకాల ఒత్తిడి, రిటైల్‌ ద్రవ్యోల్బణం , అంతర్జాతీయ మార్కెట్‌ల నుంచి ప్రతికూల సంకేతాల ప్రభావంతో మార్కెట్లు దిగజారిపోయాయి. అక్టోబర్‌ నెలలో 14 నెలల గరిష్ఠంగా పెరిగిన రిటైల్‌ ద్రవ్యోల్బణం, ఆర్‌ బి ఐ వడ్డీ రేట్ల తగ్గింపుకు సంబంధించి అంచనాలను నష్టపరిచింది. ఈ పరిణామాలతో, ఈ రోజు మార్కెట్లు ఐదో రోజు వరుసగా నష్టాలు చవి చూసాయి. ప్రధానంగా బ్యాంకింగ్‌, ఆటో మొబైల్‌ షేర్లలో అమ్మకాల ఒత్తిడి చోటుచేసుకుంది. హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్ల పతనం కారణంగా మార్కెట్లు భారీగా కుదుపు చెందాయి.

వివరాలు 

సెన్సెక్స్‌ 984పాయింట్ల నష్టంతో 77,690.95వద్ద ముగిసింది

సెన్సెక్స్‌ 1,100 పాయింట్ల నష్టాన్ని నమోదు చేయగా, నిఫ్టీ కూడా 23,600 దిగువకు చేరింది. దేశంలోని ప్రధాన కంపెనీల విలువ మొత్తం రూ.8 లక్షల కోట్ల మేర తగ్గి రూ.430 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌ ప్రారంభంలో 78,495.53 వద్ద ప్రారంభమై, ఇంట్రాడేలో 77,533.30 వద్ద కనిష్ఠాన్ని తాకింది. అనంతరం కొన్ని కోలుకోవడంతో 984పాయింట్ల నష్టంతో 77,690.95వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 324 పాయింట్ల నష్టంతో 23,559.05 వద్ద స్థిరపడింది. రూపాయి డాలరుతో మారకం విలువ 84.38 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో,ఎన్టీపీసీ, టాటా మోటార్స్‌,ఇన్ఫోసిస్‌ మినహా అన్ని షేర్లు నష్టపోయాయి. ముఖ్యంగా టాటా స్టీల్‌,మహీంద్రా అండ్‌ మహీంద్రా,అదానీ పోర్ట్స్‌,జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌,స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా షేర్లు ప్రధానంగా నష్టపోయాయి.

వివరాలు 

బంగారం ఔన్సు ధర 2613 డాలర్లు 

అంతర్జాతీయ మార్కెట్లలో, బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 72.30 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, బంగారం ఔన్సు ధర 2613 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లు, సియోల్‌, టోక్యో, హాంకాంగ్‌ నష్టాల్లో ముగించగా, షాంఘై లాభాల్లో ముగిసింది. యూరోపియన్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. కారణాలు: ప్రపంచవ్యాప్తంగా బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గిస్తున్న సందర్భంలో, భారతీయ రిజర్వు బ్యాంక్‌ (ఆర్‌బీఐ) కీలక వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచడమే మార్కెట్లపై ప్రభావం చూపించింది. అక్టోబర్‌ నెలలో వెలువడిన రిటైల్‌ ద్రవ్యోల్బణ డేటా కూడా ఆందోళన కలిగించింది. అందువల్ల వడ్డీ రేట్ల తగ్గింపు త్వరలో ఉండకపోవచ్చనే అంచనాలు మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపాయి.

వివరాలు 

డాలర్‌ విలువ బలపడటంతో, రూపాయి మరింత బలహీనం 

విదేశీ మదుపర్ల అమ్మకాల ధోరణి కొనసాగుతూనే ఉంది. మంగళవారం రూ.3,024 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. అక్టోబర్‌లో రూ.1.14 లక్షల కోట్ల విలువైన నిధులను వెనక్కి తీసుకున్న విదేశీ మదుపర్లు, నవంబరులో ఇప్పటి వరకు రూ.23,911 కోట్లు ఉపసంహరించుకున్నారు. డొనాల్డ్ ట్రంప్‌ ఎన్నికల విజయంతో డాలర్‌ విలువ బలపడటంతో, రూపాయి మరింత బలహీనపడుతోంది, ఇది కూడా మార్కెట్లపై ప్రభావం చూపింది.