AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర
ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుంది. పవన్ కళ్యాణ్తో పాటు ఇతర మంత్రులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఈ సమావేశంలో ఇసుక సీనరేజ్ రద్దు చేయడం, ఉచిత ఇసుక విధానం సవరణపై మంత్రి వర్గం ఆమోదం తెలపనుంది. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు ప్రతిపాదన కూడా కేబినెట్ ముందుకు రానున్నది. కొత్త రేషన్ కార్డుల జారీ,వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపు,రేషన్ డీలర్ల నియామకం,పోలవరం ప్రాజెక్టు పనులపై చర్చ జరిగే అవకాశం ఉంది. దేవాలయ పాలక మండలి సభ్యుల సంఖ్య పెంపుపై కూడా కేబినెట్ లో చర్చించనున్నారు. అమరావతి ప్రాజెక్టులపై కూడా ప్రత్యేకంగా చర్చ జరగనుంది.
రాష్ట్ర బడ్జెట్ పై చర్చ
ఈ భేటీ ముఖ్యమైనదిగా భావిస్తున్నారు, ఎందుకంటే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 120 రోజులు పూర్తి అవుతోంది . ఈ కేబినెట్ సమావేశంలో ముఖ్యంగా రాష్ట్ర పూర్తి స్థాయి బడ్జెట్పై కూడా చర్చ జరగనుంది. నవంబరు రెండో వారంలో ఈ బడ్జెట్ ప్రవేశ పెట్టాలని చంద్రబాబు సర్కార్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఎన్నికల నేపథ్యంలో గత ప్రభుత్వం ఫిబ్రవరిలో ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ సమర్పించింది. పూర్తిస్థాయి బడ్జెట్ తేదీలపై అధికారిక ప్రకటన రానున్నది. ప్రస్తుతం ఆర్థిక శాఖ అధికారులు, మంత్రి పయ్యావుల కేశవ్ ఈ ప్రక్రియను పరిశీలిస్తున్నారు.
గతంలో ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో వైసీపీ ప్రభుత్వం ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్లో మొత్తం రూ.2,86,389 కోట్లతో ఖర్చు చేశారు. జూన్లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో పూర్తి స్థాయి బడ్జెట్ సమర్పించడానికి వీలు కాలేదు. అప్పటి పరిస్థితుల్లో ఓటాన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు, అయితే చంద్రబాబు ప్రభుత్వం నవంబరులో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది.