
Ratan Mohini Dadi: బ్రహ్మ కుమారీస్ చీఫ్ రతన్ మోహిని దాదీ కన్నుమూత
ఈ వార్తాకథనం ఏంటి
ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అధిపతి, రాజయోగిని రతన్ మోహిని దాదీ మంగళవారం తెల్లవారుజామున అహ్మదాబాద్లోని ఒక ఆసుపత్రిలో పరమపదించారని బ్రహ్మకుమారీస్ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.
ఆమె వయసు 101 సంవత్సరాలు. మౌంట్ ఆబూ (రాజస్థాన్)లోని సంస్థ ప్రధాన కార్యాలయానికి ఆమె పార్థివ దేహాన్ని తరలించనున్నట్టు వెల్లడించారు.
అంత్యక్రియలు ఏప్రిల్ 10న నిర్వహించనున్నారు.
వివరాలు
ఆమె జీవితంలో అనేక ఆధ్యాత్మిక ప్రయాణాలు
రతన్ మోహిని దాదీ అసలు పేరు లక్ష్మి. ఆమె 1925లో అప్పటి అఖండ భారతంలో భాగమైన, ప్రస్తుత పాకిస్థాన్లో ఉన్న హైదరాబాద్ పట్టణంలో జన్మించారు.
కేవలం 13 ఏళ్ల వయసులోనే బ్రహ్మకుమారీస్ సంస్థలో చేరి ఆధ్యాత్మిక మార్గంలో అడుగుపెట్టారు.
దేశ విభజన సమయంలో రాజస్థాన్కు వచ్చారు. ఆమె జీవితంలో అనేక ఆధ్యాత్మిక ప్రయాణాలు చేపట్టి, సుమారు 70 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు.
దేశవ్యాప్తంగా ఉన్న 4,600 శిక్షణ కేంద్రాల్లో దాదీజీ బ్రహ్మకుమారీలను శిక్షణ ఇచ్చారు. దాదాపు 46 వేల మంది బ్రహ్మకుమారీలు ఆమె మార్గదర్శనంలో తీర్చిదిద్దబడ్డారు.
వివరాలు
రాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు ప్రముఖుల సంతాపం
రతన్ మోహిని దాదీ మరణంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.
విదేశీ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము "బ్రహ్మకుమారీస్ సంస్థకు మార్గదర్శకురాలిగా దాదీజీ ఎంతో మందికి ఆధ్యాత్మిక మార్గంలో దిశానిర్దేశం చేశారు" అని 'ఎక్స్' (X) ద్వారా తన సందేశంలో పేర్కొన్నారు.
ప్రధాని మోదీ స్పందిస్తూ, "రతన్ మోహిని దాదీ ఒక గొప్ప ఆధ్యాత్మిక సాధకురాలు. జ్ఞానం, కరుణ, సేవా భావంతో ఆమె జీవితం స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఆమె ఆత్మకు శాంతి కలగాలి" అని 'ఎక్స్'లో పేర్కొన్నారు.