అమిత్ షా సమక్షంలో రూ.2,378 కోట్ల డ్రగ్స్ ధ్వంసం
దేశంలోని వివిధ ప్రాంతాల్లో స్వాధీనం చేసుకున్న 1.44 లక్షల కిలోల మాదకద్రవ్యాలను నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ధ్వంసం చేశారు. దిల్లీలో ఈ ప్రక్రియను కేంద్ర హోం శాఖ మంతి అమిత్ షా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షించారు. ఈ డ్రగ్స్ విలువ మార్కెట్లో రూ.2,378 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. 'డ్రగ్స్ అక్రమ రవాణా, జాతీయ భద్రత' అనే పేరుతో నేడు కాన్ఫరెన్స్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అమిత్ షా అధ్యక్షత వహించారు. ఎన్సీబీ హైదరాబాద్ యూనిట్ నుంచి 6,590 కేజీలు, ఇండోర్ యూనిట్ 822 కేజీలు, జమ్ము యూనిట్ 356 కేజీలు సీజ్ చేశారు.
డ్రగ్స్ అక్రమ సరఫరాపై ఉక్కుపాదం : అమిత్ షా
2022 జూన్ 1 నుంచి 2023 జులై 15 వరకు.. సుమారు 8 లక్షల 76 వేల కిలోల డ్రగ్స్ను ధ్వంసం చేశారు. ధ్వంసం చేసిన ఈ మాదకద్రవ్యాల విలువు దాదాపుగా రూ. 9,580 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. మధ్యప్రదేశ్లో 1,03,884 కిలోలు, చండీగఢ్లో 229, గోవాలో 25, అసోంలో 1,486, హరియాణాలో 2,458, గుజరాత్లో 4,277, జమ్ముకశ్మీర్లో 4,069, మహారాష్ట్రలో 159, త్రిపురలో 1,803, ఉత్తరప్రదేశ్లో 4,049 కిలోల మాదకద్రవ్యాలను అధికారులు ధ్వంసం చేశారు. డ్రగ్స్ అక్రమ సరఫరాపై ఉక్కుపాదం మోపాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అదేశించారు.