Page Loader
Andhrapradesh: ఉత్తరాంధ్రలో బీభత్సం సృష్టిస్తున్న వర్షాలు.. జలాశయాలకు పోటెత్తుతున్న వరద ప్రవాహం
ఉత్తరాంధ్రలో బీభత్సం సృష్టిస్తున్న వర్షాలు..

Andhrapradesh: ఉత్తరాంధ్రలో బీభత్సం సృష్టిస్తున్న వర్షాలు.. జలాశయాలకు పోటెత్తుతున్న వరద ప్రవాహం

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 10, 2024
09:02 am

ఈ వార్తాకథనం ఏంటి

తీవ్ర వర్షాలు ఉత్తరాంధ్ర జిల్లాలను అతలాకుతలం చేస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం కొంత తగ్గుముఖం పట్టినా, 7, 8 తేదీల్లో కురిసిన భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిప్రవహించాయి. వరద నీటి ఉద్ధృతికి అనేక రహదారులు తెగిపోయాయి, కల్వర్టులు కొట్టుకుపోయాయి, రాకపోకలు నిలిచిపోయాయి. జలాశయాలు ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో, కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి.

వివరాలు 

వరదల వల్ల కొట్టుకుపోయిన  వంతెనలు 

విశాఖపట్టణం,అనకాపల్లి జిల్లాల్లో కొండచరియలు విరిగిపడి కొన్ని ఇళ్లు నేలమట్టమయ్యాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా వై.రామవరంలో అత్యధికంగా 14 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లో కుండపోత వర్షాలకు పిల్లిగడ్డ అంతర్రాష్ట్ర వంతెన కొట్టుకుపోయింది. ఈ ఘటనతో రాకపోకలు నిలిచిపోయాయి. చింతపల్లి, మడిగుంట వంటి ప్రాంతాల్లో నిర్మాణం జరుగుతున్న వంతెనలు వరదల వల్ల కొట్టుకుపోయాయి. రహదారులు పాడైపోయి, వాహన రాకపోకలు నిలిచిపోయాయి. విజయనగరంలో పారాది వంతెన మళ్లింపు మార్గం కొట్టుకుపోవడంతో సుమారు కోటి రూపాయల నష్టం జరిగింది.

వివరాలు 

ప్రమాదకరస్థాయికి తాండవ జలాశయం 

అనకాపల్లి జిల్లా తాండవ జలాశయం ప్రమాదకరస్థాయికి చేరుకుంది, మరికొన్ని గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. ఒడిశాలో కురుస్తున్న వర్షాలు వంశధార, నాగావళి, బాహుదా నదుల్లో భారీగా వరదలు తీసుకువస్తున్నాయి. వర్షాలు, వరదల వల్ల అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో అనేక హెక్టార్లలో పంటలు నీట మునిగాయి. శ్రీకాకుళంలో 38 ఇళ్లు దెబ్బతిన్నాయి, చెరువులకు గండ్లు పడ్డాయి, మూగజీవాలు మృతి చెందాయి.