
Operation Sindoor: యుద్ధ విమానాలను కోల్పోయామన్న రక్షణ అధికారి వ్యాఖ్యలతో తీవ్ర దుమారం.. భారత ఎంబసీ కీలక ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లా పహల్గామ్ సమీపంలోని బైసరన్ లోయలో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' నేపథ్యంలో రక్షణ అధికారిగా ఉన్న కెప్టెన్ శివకుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఆయన ప్రకారం, ఉగ్రవాద స్థావరాలపై జరిపిన దాడుల్లో భారత్కి పలు సవాళ్లు ఎదురయ్యాయని, ఇందులో భారత సైన్యం కొన్ని యుద్ధ విమానాలను కోల్పోయిందని తెలిపారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ),కాంగ్రెస్ పార్టీ మధ్య మాటల యుద్ధం చెలరేగింది. ఈ వివాదంపై తాజాగా ఇండోనేషియా రాజధాని జకార్తాలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. శివకుమార్ వ్యాఖ్యలు సందర్భోచితం కావని, ఆయన ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపింది.
వివరాలు
పాకిస్థాన్-భారత్ ఘర్షణపై విశ్లేషణ: ఇండోనేసియా రక్షణ వ్యూహాలు
జూన్ 10న ఇండోనేషియాలో నిర్వహించిన 'పాకిస్థాన్-భారత్ ఘర్షణపై విశ్లేషణ: ఇండోనేసియా రక్షణ వ్యూహాలు' అనే అంశంపై జరిగిన సదస్సులో కెప్టెన్ శివకుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. అనంతరం అక్కడ భారత రాయబార కార్యాలయం సోషల్ మీడియా వేదికగా స్పందించింది. ''శివకుమార్ గారు చేసిన వ్యాఖ్యలు సంబంధిత ప్రదర్శనలో భాగంగా వచ్చాయి. అయితే కొన్ని మీడియా సంస్థలు వాటిని తప్పుగా అర్థం చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఆయన అభిప్రాయాన్ని అసలైన భావం నుండి మళ్లించి చూపించినట్టు అనిపిస్తోంది'' అని వెల్లడించింది.
వివరాలు
భారత సాయుధ దళాలు ప్రజా రాజకీయ నాయకత్వంలో పనిచేస్తాయి
ఈ సందర్భంగా భారత రాయబార కార్యాలయం ఒక కీలక విషయాన్ని స్పష్టం చేసింది. భారత సాయుధ దళాలు ప్రజా రాజకీయ నాయకత్వంలో పనిచేస్తాయని అని పేర్కొంది. ''మన దేశానికి పక్కనున్న కొన్ని దేశాల మాదిరిగా కాదు. భారతదేశ సైన్యం పూర్తి స్థాయిలో ప్రజాస్వామ్య విధానంలో ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పని చేస్తుంది'' అని వివరించింది. 'ఆపరేషన్ సిందూర్' ప్రధాన లక్ష్యం పాకిస్థాన్లోని ఉగ్రవాద శిబిరాలను అణిచివేయడమే అని స్పష్టం చేసింది. అంతేకాక, పరిస్థితులు అదుపు తప్పకుండా ఉండేందుకు భారత ప్రభుత్వం సమయోచితంగా చర్యలు తీసుకుందని తెలిపింది.
వివరాలు
కొన్ని యుద్ధ విమానాలను కోల్పోయాం: శివకుమార్
కెప్టెన్ శివకుమార్ చేసిన వ్యాఖ్యల ప్రకారం,రాజకీయంగా మా సైనికులకు స్పష్టమైన ఆదేశం ఉగ్రవాద శిబిరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకోవాలి.. పాకిస్థాన్ సైనిక స్థావరాలపై దాడి చేయడం కాదు అన్నది ఆ ఆదేశాలలో పేర్కొన్నారు. ఈఆంక్షల కారణంగా తొలి దశలో భారత సైన్యం శత్రు స్థావరాలపై చర్యలు తీసుకోవడంలో జాప్యం ఎదుర్కొన్నదని చెప్పారు. అయితే,పరిస్థితి మారిన తరువాత భారత్ తన వ్యూహాన్ని మార్చి పాకిస్థాన్ సైనిక స్థావరాలపై దాడులకు దిగినట్టు వివరించారు. ఈదాడుల్లో బ్రహ్మోస్ క్షిపణులు,సర్ఫేస్ టు ఎయిర్,సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైళ్లను ఉపయోగించి విస్తృత స్థాయిలో దాడులు జరిపినట్టు ఆయన వెల్లడించారు. అయితే ఈ ప్రణాళికల అమలులో భారత వైమానిక దళం కొన్ని యుద్ధ విమానాలను కోల్పోయిందని కూడా కెప్టెన్ శివకుమార్ పేర్కొన్నారు.