Page Loader
Shehbaz Sharif: భారత్‌లో.. పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ యూట్యూబ్‌ ఛానల్‌ బ్లాక్‌ 
భారత్‌లో.. పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ యూట్యూబ్‌ ఛానల్‌ బ్లాక్‌

Shehbaz Sharif: భారత్‌లో.. పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ యూట్యూబ్‌ ఛానల్‌ బ్లాక్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
May 02, 2025
05:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి తరువాత భారత్-పాక్‌ సంబంధాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. తాజాగా పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్‌కు చెందిన యూట్యూబ్ ఛానల్ స్ట్రీమింగ్‌ను భారతదేశంలో నిలిపివేసింది. ఈ ఛానల్‌ను యాక్సెస్ చేసేందుకు యత్నించే వారికి, "ఈ కంటెంట్ ప్రస్తుతం భారతదేశంలో అందుబాటులో లేదు. ఇది జాతీయ భద్రతా కారణాలపై తీసుకున్న చర్య" అనే సందేశం ప్రత్యక్షమవుతోంది.

వివరాలు 

రక్షణ మంత్రికి చెందిన ఎక్స్‌ ఖాతా కూడా బ్లాక్

ఇటీవల ఏర్పడిన ఉద్రిక్తతల మధ్య, పాకిస్థాన్ ఆధారితంగా నడుస్తున్న అనేక యూట్యూబ్ ఛానల్స్ ప్రసారాలు, అలాగే అక్కడి సామాజిక మాధ్యమ ఖాతాలను కూడా భారత్‌లో నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో పాక్‌కు చెందిన కొన్ని వార్తా, వినోద ఛానల్స్ మాత్రమే కాకుండా, పాకిస్థాన్‌కి చెందిన మాజీ క్రికెటర్లు షోయబ్ అక్తర్, బాసిత్ అలీ, షాహిద్ అఫ్రిది నిర్వహిస్తున్న యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉన్నాయి. అంతేకాక, పాక్‌ రక్షణ మంత్రికి చెందిన ఎక్స్‌ ఖాతా కూడా బ్లాక్ చేయబడింది.

వివరాలు 

అర్షద్ నదీమ్‌కు చెందిన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా బ్లాక్ 

ఇటీవల, పాకిస్థాన్‌ క్రికెటర్లైన బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్, షహీన్ అఫ్రిది ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను సస్పెండ్ చేశారు. అంతకుముందే ఒలింపిక్స్‌లో స్వర్ణ పతక విజేతగా నిలిచిన జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్‌కు చెందిన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను కూడా బ్లాక్ చేసిన విషయం తెలిసిందే. పహల్గాం దాడి అనంతరం తీసుకున్న చట్టపరమైన చర్యలలో భాగంగా అతని ఖాతా భారత్‌లో నిలిపివేయబడింది. నదీమ్ ఖాతాను తెరవడానికి ప్రయత్నించే వారికి, "ఈ ఖాతా ప్రస్తుతం భారతదేశంలో అందుబాటులో లేదు. ఇందులోని సమాచారాన్ని నియంత్రించాల్సిన చట్టపరమైన అభ్యర్థన ఆధారంగా ఇది జరిగిన చర్య" అనే సందేశం కనిపిస్తోంది.