PM Modi: వచ్చే నెలలో ప్రధాని మోదీ అమెరికా పర్యటన.. అధ్యక్షుడు ట్రంప్తో భేటీ అయ్యే అవకాశం
ఈ వార్తాకథనం ఏంటి
భారత్-అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు ఉద్రిక్తతలు ఎదుర్కొంటున్న వేళ, రెండు దేశాల నేతల మధ్య కీలక భేటీకి రంగం సిద్ధమవుతోంది. వచ్చే నెల సెప్టెంబరులో న్యూయార్క్లో జరగనున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఈ పర్యటనలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రత్యేకంగా సమావేశమై, రెండు దేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య సమస్యలపై చర్చించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.
వివరాలు
భగ్గుమంటున్న వాణిజ్య వివాదాలు
మోదీ-ట్రంప్ల మధ్య గతంలో అనుబంధం సానుకూలంగా ఉన్నప్పటికీ, ఇటీవల అమెరికా తీసుకున్న కఠిన నిర్ణయాలు సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపించాయి.
ముఖ్యంగా, భారతీయ ఉత్పత్తులపై అమెరికా 50 శాతం వరకు భారీ టారిఫ్ సుంకాలను విధించడం ప్రధాన కారణంగా మారింది.
అందులో 25 శాతం వాణిజ్య కారణాలకోసం, మరో 25 శాతం రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులను కొనసాగిస్తోందని పేర్కొంటూ విధించారు.
వీటిలో తొలి విడత సుంకాలు ఈ నెల 7వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. మిగిలిన సుంకాలు ఆగస్టు 27 నుంచి అమలులోకి రానున్నాయి.
ఈ గడువు దగ్గరపడుతున్న కారణంగా ఇరు దేశాల అధికారులు ఒప్పందం సాధనకు ముమ్మర చర్చలు జరుపుతున్నారు.
వివరాలు
రెండు ప్రధాన అడ్డంకులు
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందానికి ప్రధానంగా రెండు అవరోధాలు ఎదురవుతున్నాయి.
మొదటిది-అమెరికా, తమ వ్యవసాయ,పాడి ఉత్పత్తులకు భారత మార్కెట్లను పూర్తిగా తెరవాలని డిమాండ్ చేస్తుండగా, భారత్ ఈ విషయంలో పూర్తిగా అంగీకరించడంలేదు.
రెండవది- ఉక్రెయిన్తో యుద్ధం కొనసాగిస్తున్న రష్యాకు ఆర్థిక లాభం కలిగించేలా భారత్ చమురు దిగుమతులు చేస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. ఈ కొనుగోళ్లను వెంటనే తగ్గించాలన్న ఒత్తిడిని అమెరికా పెంచుతోంది.
వివరాలు
మోదీ పర్యటనకు ప్రాధాన్యత
సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభమయ్యే ఐరాస సమావేశాల సమయంలో జరగనున్న మోదీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ పర్యటనలో ఆయన ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్స్కీతో పాటు మరికొన్ని దేశాల నేతలతో సమావేశమయ్యే అవకాశం ఉంది.
మరోవైపు, ఆగస్టు 15న జరగనున్న ట్రంప్-పుతిన్ భేటీని భారత్ సవివరంగా గమనిస్తోంది.
విశ్లేషకుల అంచనా ప్రకారం, మోదీ-ట్రంప్ సమావేశం విజయవంతం కావడం వాణిజ్య చర్చల పురోగతిపైనా, అలాగే సమకాలీన అంతర్జాతీయ పరిణామాలపైనా ఆధారపడి ఉండనుంది.