Page Loader
Operation Sindoor: భారత్‌-పాక్‌ ఉద్రిక్తతల వేళ కేంద్ర మంత్రి అమిత్‌ షా కీలక సమావేశం.. హాజరైన అజిత్ దోవల్ 

Operation Sindoor: భారత్‌-పాక్‌ ఉద్రిక్తతల వేళ కేంద్ర మంత్రి అమిత్‌ షా కీలక సమావేశం.. హాజరైన అజిత్ దోవల్ 

వ్రాసిన వారు Sirish Praharaju
May 09, 2025
01:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' నేపథ్యంలో పాకిస్థాన్‌తో వాస్తవ నియంత్రణ రేఖ వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ మళ్ళీ మళ్ళీ రెచ్చగొట్టే చర్యలకు సమర్థవంతంగా ప్రతిస్పందించేందుకు భారత ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. దేశ భద్రతను కాపాడటానికి అవసరమైన అన్ని వ్యవస్థలను కేంద్రం నిరంతరంగా సమీక్షిస్తోంది. ఈ సందర్భంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పలు కీలక భద్రతా అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్,సీఐఎస్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్తో పాటు హోంశాఖకు చెందిన సీనియర్ అధికారులు పాల్గొన్నారు. సరిహద్దు ప్రాంతాలు,విమానాశ్రయాల్లో భద్రతా ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. ఈసమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా హాజరయ్యారు. ఈ భేటీ అమిత్ షా నివాసంలోనే జరిగింది.

వివరాలు 

 పంజాబ్ సరిహద్దు వద్ద పాకిస్థాన్ వ్యక్తిని బీఎస్ఎఫ్ జవాన్లు హతమార్చారు

ఈ నేపథ్యంలో, చొరబాట్లకు ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో, పాకిస్తాన్‌తో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాలు ముందస్తుగా పలు జాగ్రత్త చర్యలు చేపట్టాయి. ఇటీవలి కాలంలో పంజాబ్ సరిహద్దు వద్ద భారత భూమిలోకి చొరబడేందుకు యత్నించిన పాకిస్థాన్ వ్యక్తిని బీఎస్ఎఫ్ జవాన్లు హతమార్చిన సంగతి తెలిసిందే. ఇక రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న 1,037 కిలోమీటర్ల పాకిస్తాన్ సరిహద్దు మొత్తాన్ని పూర్తిగా మూసివేశారు. అనుమానాస్పదంగా వ్యవహరించే ఎవరినైనా అక్కడికక్కడే కాల్చివేసేలా కఠిన ఆదేశాలు జారీ చేశారు.

వివరాలు 

 ఏడుగురు ఉగ్రవాదులు మృతి

జమ్ముకశ్మీర్‌లోని సాంబ జిల్లాలో పాకిస్తాన్ ఉగ్రవాదులు చొరబాటుకు చేసిన ప్రయత్నాన్ని బీఎస్ఎఫ్ ధైర్యంగా అడ్డగించింది. ఈ ఎదురుకాల్పుల్లో కనీసం ఏడుగురు ఉగ్రవాదులు మృతిచెందినట్లు సమాచారం. ఇంకా, పాకిస్తాన్ నియంత్రణ రేఖకు అవతల భాగం నుంచి శక్తివంతమైన గోళీల దాడులకు పాల్పడుతోంది. ముఖ్యంగా ఉరి, జమ్మూ, కశ్మీర్ ప్రాంతాల్లో ఈ షెల్లింగ్ తీవ్రత ఎక్కువగా ఉంది. భయాందోళనకు లోనైన అనేక మంది నివాసితులు తమ ఇళ్లను ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నారు.