Page Loader
Raj Kasireddy: 'పార్టీ ఫండ్‌ ఎక్కువ వచ్చేలా మద్యం విధానం'.. సిట్‌ విచారణలో గుట్టు విప్పిన కెసిరెడ్డి
'పార్టీ ఫండ్‌ ఎక్కువ వచ్చేలా మద్యం విధానం'.. సిట్‌ విచారణలో గుట్టు విప్పిన కెసిరెడ్డి

Raj Kasireddy: 'పార్టీ ఫండ్‌ ఎక్కువ వచ్చేలా మద్యం విధానం'.. సిట్‌ విచారణలో గుట్టు విప్పిన కెసిరెడ్డి

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 23, 2025
09:31 am

ఈ వార్తాకథనం ఏంటి

వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ పాలనలో మద్యం సరఫరా కాంట్రాక్టుల విషయంలో భారీ అవినీతి చోటుచేసుకున్నట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) తన విచారణలో వెల్లడించింది. మద్యం డిస్టిలరీల నుంచి సరఫరా ఆర్డర్లను పొందిన ప్రముఖ కంపెనీల ద్వారా నెలకు సగటున రూ.50 నుంచి రూ.60 కోట్ల వరకు ముడుపులు వసూలు చేసినట్లు గుర్తించారు. ఈ మొత్తాన్ని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి కార్యాలయ ప్రత్యేక అధికారిగా పనిచేసిన కృష్ణమోహన్‌రెడ్డి,ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, బాలాజీ అనే వ్యక్తికి అందజేసేవారని సిట్‌ తెలిపింది. 2019 నుండి 2024 మధ్య కాలంలో మొత్తం రూ.3,200 కోట్ల మేర ముడుపులు వసూలు చేసినట్లు సిట్‌ విచారణలో తేలింది.

వివరాలు 

ప్రభుత్వమే నేరుగా మద్యం దుకాణాలు నడిపే విధంగా కొత్త విధానం 

ఈ అవినీతి కార్యకలాపాల వ్యూహరచన, నిర్వహణలో జగన్ ఐటీ సలహాదారుగా ఉన్న రాజ్‌ కెసిరెడ్డి ప్రధాన పాత్ర పోషించారని స్పష్టమైంది. రాజ్‌ కెసిరెడ్డి ఈ అవినీతి వ్యవస్థను ఎంపీ మిథున్‌రెడ్డి, విజయసాయిరెడ్డి, ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ అధినేత సజ్జల శ్రీధర్‌రెడ్డి, అప్పటి సీఎంవో కార్యదర్శి ధనుంజయరెడ్డి, ఓఎస్‌డీ కృష్ణమోహన్‌రెడ్డి, అప్పటి ఏపీఎస్‌బీసీఎల్‌ మేనేజింగ్ డైరెక్టర్ వాసుదేవరెడ్డి, ప్రత్యేకాధికారి డి. సత్యప్రసాద్‌, బాలాజీ అనే మరో వ్యక్తితో కలిసి నిర్వహించినట్లు దర్యాప్తులో బయటపడింది. ప్రభుత్వమే నేరుగా మద్యం దుకాణాలు నడిపే విధంగా ఒక కొత్త మద్యం విధానాన్ని రూపొందించే బాధ్యతను అప్పటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డే తనపై వేసినట్లు రాజ్‌ కెసిరెడ్డి సిట్‌ విచారణలో వెల్లడించినట్లు పేర్కొన్నారు.

వివరాలు 

 విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు 

వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీకి పార్టీ నిధుల సమకూరేందుకు, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి అధిక ఆదాయం కల్పించేందుకు మద్యం విధానాన్ని రూపొందించాలన్నదే ముఖ్య ఉద్దేశంగా ముఖ్యమంత్రి జగన్‌ తనకు సూచించారని రాజ్‌ కెసిరెడ్డి పేర్కొన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న (ఏ1) రాజ్‌ కెసిరెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) సోమవారం సాయంత్రం అరెస్ట్ చేసింది. తర్వాత మంగళవారం మధ్యాహ్నం ఆయనను విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్యులు ఆయన్ను పరిశీలించిన అనంతరం ఆయన ఆరోగ్యం బాగుందని ధృవీకరించడంతో అదే సాయంత్రం ఆయన్ను విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచారు.

వివరాలు 

హవాలా మార్గంలో నగదు బదిలీలు ఎలా జరిగాయి?

ఈ కేసులో ఇప్పటివరకు చేసిన విచారణలో బయటపడిన ముఖ్యమైన అంశాలతో పాటు,రాజ్‌ కెసిరెడ్డితో సంబంధాలున్న వివరాలను సిట్‌ తమ రిమాండు రిపోర్టులో పొందుపరిచి న్యాయస్థానానికి సమర్పించింది. అలాగే ఆయనకు రిమాండు విధించాల్సిందిగా కోర్టును కోరింది.ఈ మద్యం విధానాన్ని రూపొందించే సమయంలో ముడుపుల వసూళ్లకు అనుకూలంగా జరిగిన కుట్ర,దాన్ని అమలు చేసే విధానం, ముడుపుల సొమ్మును సేకరించిన తీరుతో పాటు,ఆ మొత్తాన్ని వైట్‌లోకి మార్చేందుకు ఏయే రూపాల్లోకి,ఎక్కడెక్కడికి ఎలా మళ్లించారు? ఈ పరంగా డమ్మీ కంపెనీల ఏర్పాట్లు,హవాలా మార్గంలో నగదు బదిలీలు ఎలా జరిగాయి? ప్రభుత్వ ఖజానాకు వాటి వల్ల జరిగిన నష్టం ఎంత?ఇందులో ఎవరెవరు పాల్గొన్నారు? వంటి అన్ని వివరాలను సిట్‌ తమ రిపోర్టులో పేర్కొంది. ఇవే ఈ కేసులోని ప్రధానాంశాలు.

వివరాలు 

నెలకు రూ.50-60 కోట్ల మేర ముడుపుల లెక్కలు 

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆగస్టు 16న ప్రభుత్వం మద్యం అమ్మకాలను ప్రభుత్వమే నేరుగా నిర్వహించేలా కొత్త మద్యం విధానాన్ని ప్రకటించింది. ఈ ప్రకారం ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి.అనంతరం, వైసీపీ ప్రముఖులతో అత్యంత సన్నిహిత సంబంధాలున్న ఐఆర్‌టీఎస్‌ అధికారి వాసుదేవరెడ్డిని డిప్యుటేషన్‌పై తీసుకువచ్చి, ఏపీ స్టేట్‌ బివరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌బీసీఎల్‌) ఎండీగా, అలాగే బెవరేజెస్‌ అండ్‌ డిస్టిలరీస్‌ కమిషనర్‌గా నియమించారు. దీంతో మద్యం కొనుగోలు, విక్రయాలకే కాకుండా డిస్టిలరీల నిర్వహణ, లేబుల్‌ రిజిస్ట్రేషన్‌ వంటి అన్ని ముఖ్యమైన వ్యవహారాలు వారి ఆధీనంలోకి వెళ్లిపోయాయి.

వివరాలు 

నెలకు రూ.50-60 కోట్ల మేర ముడుపుల లెక్కలు 

ఈ నేపథ్యంలో, ఎక్సైజ్‌ శాఖలో అసిస్టెంట్‌ సెక్రటరీగా ఉన్న డి.సత్యప్రసాద్‌.. తిరుపతిలో ఎంపీ మిథున్‌రెడ్డిని కలిశారు. ఈ సమావేశంలో మిథున్‌రెడ్డి ఆయనకు, "మీరు మేము చెప్పినట్లే చేస్తే 2023లో కన్ఫర్మ్డ్‌ ఐఏఎస్‌ హోదా కల్పిస్తాను" అని హామీ ఇచ్చారు. మద్యం విక్రయాలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం సేకరించి, వాసుదేవరెడ్డితో కలిసి హైదరాబాద్‌లోని విజయసాయిరెడ్డి నివాసానికి రావాలని సూచించారు. 2019 అక్టోబరు 13న విజయసాయిరెడ్డి నివాసంలో జరిగిన సమావేశానికి సత్యప్రసాద్‌ హాజరయ్యారు. ఆ సమావేశంలో పెద్దిరెడ్డి, మిథున్‌రెడ్డి, కె.సి.రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, ఆయన మేనల్లుడు అవినాష్‌రెడ్డి అలియాస్‌ సుమిత్‌ కూడా పాల్గొన్నారు.

వివరాలు 

నెలకు రూ.50-60 కోట్ల మేర ముడుపుల లెక్కలు 

గత సంవత్సరాల్లో రాష్ట్రంలో మద్యం విక్రయాల డేటాను పరిశీలించిన విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డితో కలిసి నెలకు సుమారుగా రూ.50-60 కోట్లు ముడుపులుగా వసూలు చేసేందుకు వీలుందని అంచనావేశారు. దీనికనుగుణంగా ప్రత్యేక ప్రణాళికను రూపొందించారు.ఈ ప్రణాళికలో భాగంగా వాసుదేవరెడ్డితో కలిసి పనిచేయాలని సత్యప్రసాద్‌కు విజయసాయిరెడ్డి సూచించారు. అలాగే కన్ఫర్మ్డ్‌ ఐఏఎస్‌ పదోన్నతి హామీ కూడా ఇచ్చారు.ఆ సమయంలో ఎక్సైజ్‌ శాఖ "సీటెల్‌" అనే సాఫ్ట్‌వేర్‌ను వినియోగించేది. ఈ సిస్టమ్‌ ద్వారా రిటైల్‌ మద్యం దుకాణాలు,ఏపీఎస్‌బీసీఎల్‌ ప్రధాన కార్యాలయం,డిస్టిలరీలు అన్నీ అనుసంధానించబడి ఉండేవి.

వివరాలు 

నెలకు రూ.50-60 కోట్ల మేర ముడుపుల లెక్కలు 

ఆటోమేటెడ్‌ రిటైల్‌ అమ్మకాలు, స్టాక్‌ నిర్వహణ,ఇంటిగ్రేటెడ్‌ డేటా జనరేషన్, సరఫరా ఆర్డర్‌ ప్రక్రియలు.. ఇవన్నీ మానవ జోక్యం లేకుండానే జరిగేవి. అయితే,దీనిని తొలగించి మాన్యువల్‌ విధానాన్ని తీసుకువచ్చారు.జీఆర్‌ఓలు సీటెల్‌ ప్లాట్‌ఫారంలో అమ్మకాలు నమోదు చేసే విధానానికి స్వస్తి చెప్పి, "ఏపీటీ ఆన్‌లైన్‌" ప్లాట్‌ఫారాన్ని అమలు చేశారు. ఈ మార్పుల ద్వారా రాష్ట్రంలోని మొత్తం మద్యం ఉత్పత్తి, సరఫరా, విక్రయాల వ్యవస్థను పూర్తిగా తమ నియంత్రణలోకి తీసుకున్నారు.

వివరాలు 

తాను చెప్పిన మద్యం సరఫరా కంపెనీలను మాత్రమే ప్రోత్సహించాలని.. 

2019 డిసెంబర్‌లో మిథున్‌రెడ్డి సూచనలతో, వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్‌లు జూబ్లీహిల్స్‌లోని శరత్‌చంద్ర ఆసుపత్రి వీధిలో ఉన్న ఓ ప్రైవేటు భవనంలో కెసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డిని కలిశారు. అక్కడ జరిగిన సమావేశంలో, కొంతమంది మద్యం సరఫరాదారులు తమను కలిసారని, వారు ముడుపులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని రాజ్‌ కెసిరెడ్డి వెల్లడించారు. ముడుపులు ఇవ్వడానికి అంగీకరించిన వారినే ప్రోత్సహించాలని ఆయన స్పష్టంగా సూచించారు. ఆ సమయంలో రాజ్‌ కెసిరెడ్డి తోడల్లుడు అవినాష్‌ రెడ్డి అలియాస్ సుమిత్, అలాగే సజ్జల శ్రీధర్‌ రెడ్డి కూడా హాజరయ్యారు. తనకు తెలియకుండా ఎవ్వరినీ మద్దతు ఇవ్వవద్దని రాజ్‌ కెసిరెడ్డి హెచ్చరించారు. మద్యం సరఫరా బ్రాండ్ల బేసిక్‌ ప్రైస్‌ ఆధారంగా ఎంతమేరకు ముడుపులు వసూలు చేయాలో కూడా అదే సమావేశంలో నిర్ణయించారు.

వివరాలు 

తాను చెప్పిన మద్యం సరఫరా కంపెనీలను మాత్రమే ప్రోత్సహించాలని.. 

ఈ సమావేశం తరువాత, తాము వేసుకున్న వ్యూహం ప్రకారం.. సత్యప్రసాద్‌ తన వ్యక్తిగత ఫోన్‌ నంబర్‌ ద్వారా మద్యం డిపో మేనేజర్లతో ప్రతిరోజూ వాట్సాప్‌ కాల్‌లలో మాట్లాడే వారయ్యారు. ఏ బ్రాండ్లకు అధిక ఇండెంట్లు ఇవ్వాలి, ఏవి తగ్గించాలి, ఇవే కాకుండా పూర్తిగా తొలగించాలి అనే విషయాల్లోనూ తామే నిర్ణయాలు తీసుకునేవారు. ఈ ఇండెంట్‌ల ముసాయిదా ప్రణాళిక రాజ్‌ కెసిరెడ్డి నుంచే వస్తుండేది. ముడుపులు ఇచ్చే కంపెనీల వివరాలు ప్రకాశ్‌ ద్వారా తెలుసుకుని, ఆ కంపెనీలకే ఇండెంట్లు జారీ చేసే వ్యవస్థను అమలు చేశారు. 2020 సంక్రాంతి తర్వాత, రాజ్‌ కెసిరెడ్డి మరోసారి సమావేశం ఏర్పాటు చేశారు.

వివరాలు 

తాను చెప్పిన మద్యం సరఫరా కంపెనీలను మాత్రమే ప్రోత్సహించాలని.. 

ఈ సమావేశంలో సత్యప్రసాద్‌, సజ్జల శ్రీధర్‌రెడ్డి,అవినాష్‌రెడ్డి,వాసుదేవరెడ్డి పాల్గొన్నారు. పాత బ్రాండ్లను ఎందుకు కొనసాగిస్తున్నారనే అంశంపై రాజ్‌ కెసిరెడ్డి ప్రశ్నించగా,వాసుదేవరెడ్డి "ఓఎఫ్‌ఎస్‌" విధానానికి కొన్ని నియమాలు ఉన్నాయని సమాధానం ఇచ్చారు. అయితే ఆ తరువాత ఆయన అధికారం తీసివేసి సత్యప్రసాద్‌కు అప్పగించారు. ఆ తరవాతి నుంచి, రాజ్‌ కెసిరెడ్డి, అవినాష్‌రెడ్డి నుంచి సత్యప్రసాద్‌ నేరుగా ఆదేశాలు తీసుకుని, మద్యం సరఫరా ఆర్డర్లు ఎవరికివ్వాలో డిపో మేనేజర్లకు ఆదేశించేవారు.

వివరాలు 

ముడుపులపై మద్యం సరఫరా కంపెనీలతో చర్చ 

ప్రతి నెలకు సుమారుగా 27 నుండి 30 లక్షల ఐఎంఎల్ కేసులు,7 నుండి 10 లక్షల బీరు కేసులు విక్రయించేవారు. మొదటి దశలో రాజ్ కెసిరెడ్డి, ముప్పిడి అవినాష్ రెడ్డి, వాసుదేవరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి మద్యం సరఫరా చేసే కంపెనీలతో ముడుపుల లావాదేవీలపై చర్చలు జరిపే వారు. ఇదంతా రెండు దశలుగా కొనసాగేది. రెండో దశలో విజయవాడలో ఉన్న మద్యం సరఫరా సంస్థలు, డిస్టిలరీలతో చర్చలు జరిపే బాధ్యత వాసుదేవరెడ్డి తీసుకునేవారు. ఇక హైదరాబాద్‌లోని కంపెనీల బాధ్యత మొదట అవినాష్ రెడ్డి, ఆ తర్వాత చాణక్య అనే బిరుదుతో పిలిచే ప్రకాశ్ చేపట్టారు. చర్చలు జరుగుతున్న సమయంలో మద్యం మూలధరను (బేసిక్ ప్రైస్) ఆధారంగా తీసుకుని ముడుపుల పరిమాణాన్ని నిర్ణయించేవారు.

వివరాలు 

ముడుపులపై మద్యం సరఫరా కంపెనీలతో చర్చ 

చీప్ లిక్కర్ బ్రాండ్లుగా పేరొందిన సదరన్ బ్లూ, 9 హార్సెస్, ఆంధ్ర గోల్డ్, హెచ్‌డీ విస్కీ లాంటి వాటిపై ఒక్కో కేసుకు రూ.150 చొప్పున ముడుపులు వసూలు చేసేవారు. దారూహౌస్, రాయల్ ప్యాలెస్, బ్రిలియంట్ బ్లెండ్‌లపై ఒక్కో కేసుకు రూ.200 చొప్పున వసూలు చేశారు. ఇక మ్యాన్షన్ హౌస్, రాయల్ స్టాగ్ బ్రాండ్లకు ఒక్కో కేసుకు రూ.350 చొప్పున వసూలు చేయగా, టీచర్స్, 100 పైపర్స్ వంటి ప్రీమియం బ్రాండ్లపై ఒక్కో కేసుకు రూ.600 చొప్పున ముడుపులు వసూలు చేశారు.

వివరాలు 

ముడుపుల సొమ్ము షెల్‌ కంపెనీలు, స్థిరాస్తి సంస్థల ఖాతాల్లోకి! 

ప్రతీ ఐదు రోజులకు ఒకసారి డిస్టిలరీలు, సరఫరాదారులకు బూనే టార్గెట్‌ను చాణక్య అలియాస్‌ బూనేటి ప్రకాశ్‌ ఫోన్‌ ద్వారా తెలియజేసేవారు. ఈ కమ్యూనికేషన్ దర్యాప్తు సంస్థలకు దొరకకుండా ఉండేందుకు, ఆయన విపీఎన్‌, వీఓఐపీ సర్వీసులు, వర్చువల్‌ నంబర్లు, అంతర్జాతీయ కాలింగ్ లైన్లు, వాట్సాప్‌, సిగ్నల్‌ వంటి యాప్‌లను వినియోగించేవారు. ఆయా రోజుల్లో దాచాల్సిన ముడుపుల మొత్తాన్ని ఏ ప్రాంతంలో అందించాలో స్పష్టంగా సూచించేవారు. ఏపీఎస్‌బీసీఎల్‌ నుండి పేమెంట్‌ వచ్చిన వెంటనే డిస్టిలరీలు, సప్లయర్లు ఆ డబ్బును నగదుగా మార్చి మద్యం సిండికేట్‌కి పంపించేవారు. ఈ నగదు మార్గాలను గోప్యంగా ఉంచేందుకు పలు అక్రమ మార్గాలను అవలంబించారని దర్యాప్తు అధికారుల చెబుతున్నారు.

వివరాలు 

అక్రమ నగదు మార్గాలు 

1. బంగారపు మార్గం: డిస్టిలరీలు తమ వద్ద ఉన్న డబ్బును బంగారం లేదా బులియన్‌ ఖాతాల్లోకి మార్చేవి. ఈ విధంగా వందల కోట్ల విలువైన బంగారం, నగదు ముడుపులుగా చెల్లింపులు జరిగేవి. 2. వ్యక్తిగత కంపెనీల ఖాతాల ఉపయోగం: మద్యం సిండికేట్‌లోని సభ్యుల మిత్రులు, కుటుంబ సభ్యుల పేరిట నడుపుతున్న స్థిరాస్తి సంస్థలు, ఇతర వ్యాపార సంస్థల ఖాతాల్లోకి డబ్బులు మళ్లించేవారు. 3. హవాలా మార్గం: ముంబయి,ఢిల్లీ ప్రాంతాల్లో ఉన్న వ్యూహాత్మకంగా అమర్చిన హవాలా నెట్‌వర్క్‌ల సహాయంతో డబ్బును షెల్‌ కంపెనీల ఖాతాల్లోకి పంపేవారు. ఇవి దేశంలో గానీ,విదేశాల్లో గానీ ఉండే కంపెనీల ఖాతాలవే.ఈ హవాలా నెట్‌వర్క్‌ నిర్వాహకులకు అప్పటి వైకాపా ప్రభుత్వంలోని కొందరు రాజకీయ నేతలతో సంబంధాలున్నాయన్న కోణంలో ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.

వివరాలు 

అక్రమ నగదు మార్గాలు 

4. ఓవర్‌ఇన్‌వాయిసింగ్‌ తంత్రం: ఈఎన్‌ఏ, ఖాళీ బాటిళ్లు, మూతలు, కార్టన్ల సరఫరాదారులకు వాస్తవ ధర కంటే మూడు నుంచి ఐదు రెట్లు అధికంగా చెల్లించేవారు. ఆ అదనపు డబ్బును సప్లయర్లు నగదు రూపంలో తిరిగి అందించేవారు. ఈ లావాదేవీలను చట్టబద్ధంగా చూపించి, ముసుగుగా ముడుపులును చెల్లించడమే లక్ష్యంగా ఈ వ్యూహాన్ని ఉపయోగించారట. 5. బ్రాండ్‌ ప్రమోషన్‌ ముసుగు: బ్రాండ్‌ ప్రమోషన్‌ పేరుతో కొంత డబ్బును నకిలీ ఖాతాలు,షెల్‌ కంపెనీలు,సూట్‌కేస్‌ కంపెనీల్లోకి పంపించేవారు.వారు బంగారు నాణేలు,దుస్తులు,గిఫ్ట్‌ హ్యాంపర్లు వంటివి కొన్నట్లుచూపుతూ నకిలీఇన్వాయిసులు జారీ చేసేవారు.అయితే వాస్తవంగా ఆ వస్తువులు కొనుగోలు జరగలేదు.బంగారు నాణేలు,దుస్తుల సరఫరాదారులుగా ఉన్న సంస్థలు...డిస్టిలరీలు, సప్లయర్ల ఖాతాల నుంచి వచ్చిన డబ్బులో కమీషన్‌ మినహాయించి మిగిలిన మొత్తాన్ని నగదుగా తిరిగి ఇచ్చేవి.

వివరాలు 

వైకాపా ప్రభుత్వ హయాంలో భారీ మద్యం కుంభకోణం - ఉన్నతాధికారుల పాత్ర 

వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కొందరు కీలక నేతల ఆశీర్వాదంతో మద్యం సిండికేట్‌ ఏర్పడింది. ఈ గుంపు తమ అనుకూల వ్యక్తులను ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ (APSBC)లో నియమించి, అవినీతి పనులను సాగించారు. APSBCలో పనిచేసిన అధికారులు, ఇతర వ్యక్తులు అవినీతి చర్యలకు పాల్పడి, IPC సెక్షన్ 7, 7A, 8, 13(1)(b), 13(2) కింద శిక్షార్హులుగా గుర్తించారు.