Page Loader
Dragon Fruit: పడిపోయిన డ్రాగన్‌ ఫ్రూట్‌ ధర.. కర్ణాటక, మహారాష్ట్ర దిగుమతులతో నష్టపోతున్న తెలుగు రైతులు
పడిపోయిన డ్రాగన్‌ ఫ్రూట్‌ ధర.. కర్ణాటక, మహారాష్ట్ర దిగుమతులతో నష్టపోతున్న తెలుగు రైతులు

Dragon Fruit: పడిపోయిన డ్రాగన్‌ ఫ్రూట్‌ ధర.. కర్ణాటక, మహారాష్ట్ర దిగుమతులతో నష్టపోతున్న తెలుగు రైతులు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 10, 2025
11:36 am

ఈ వార్తాకథనం ఏంటి

ఒకప్పుడు ఖరీదైన పండుగా పేరుగాంచిన డ్రాగన్‌ ఫ్రూట్‌కు ఇప్పుడు మార్కెట్‌లో గిరాకీ పడిపోయింది. పోషక విలువలు అధికంగా ఉండటంతో గతంలో ఈ పండును విదేశాల నుంచి దిగుమతులు చేసేవారు. అయితే, ఇటీవలి సంవత్సరాలలో దేశీయంగా కూడా డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగు విస్తరించింది. తెలుగు రాష్ట్రాల్లోని పలువురు రైతులు ఈ పంటను సాగు చేయడం ప్రారంభించారు. ఒకప్పుడు ఒక్క పండు ధర రూ.200 వరకూ ఉండేది. అయితే ప్రస్తుతం అది రూ.100కి పడిపోయింది. తాజాగా కర్ణాటక, మహారాష్ట్రల నుంచి విపరీతంగా డ్రాగన్‌ ఫ్రూట్లను మార్కెట్‌కు పంపిస్తున్న నేపథ్యంలో ధరలు మరింతగా పడిపోయి, నాలుగో వంతుకు చేరాయి. ఫలితంగా తెలుగు రైతులు తీవ్ర నష్టాల్లో ఉన్నామని చెబుతున్నారు.

వివరాలు 

ఆంధ్రప్రదేశ్‌లో 1100 ఎకరాలు, తెలంగాణలో 900 ఎకరాల్లో డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగు

ఈ మొక్కలను నాటిన నాలుగేళ్ల తరువాత నుంచే పంట పూర్తిగా అందుబాటులోకి వస్తుంది. సాధారణంగా ప్రతి ఎకరాకు సుమారు 6 టన్నుల వరకూ దిగుబడి వస్తుంది. పంట పూర్తిగా దిగుబడి ఇచ్చే దశకు వచ్చే వరకు రైతులు ఎకరానికి సుమారుగా రూ.5 లక్షల వరకూ పెట్టుబడి వెచ్చించాల్సి వస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 1100 ఎకరాల్లో, తెలంగాణలో 900 ఎకరాల్లో డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగు జరుగుతోంది. ఈ రెండు రాష్ట్రాల రైతులు ప్రధానంగా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి వెంబడి ఉన్న బాటసింగారం ఫల మార్కెట్‌కు తమ పండ్లను తీసుకెళ్లి అమ్ముతున్నారు.

వివరాలు 

 ఒక్కో పండు రూ.25కి 

ఇదిలా ఉండగా, మహారాష్ట్ర, కర్ణాటకల్లో ఈ పంట సాగు విస్తరించడంతో, అక్కడి రైతులు కూడా డ్రాగన్‌ ఫ్రూట్లను బాటసింగారం మార్కెట్‌కు తీసుకెళ్లడం ప్రారంభించారు. వారు తెలుగు రైతుల కంటే తక్కువ ధరకు అమ్మకాలు చేయడంతో, స్థానిక రైతుల పండ్లకు డిమాండ్‌ తగ్గిపోయింది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు అక్కడి అధికారులు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి వచ్చే వాహనాలను బాటసింగారం మార్కెట్‌లోకి అనుమతించకుండా నిలిపేశారు. అయితే ఆ వాహనదారులు జాతీయ రహదారుల వెంటే నిలిపి ఒక్కో పండును రూ.25కి విక్రయిస్తున్నారు. దీంతో మార్కెట్‌లోని వ్యాపారులు కూడా అక్కడే కొనుగోలు చేయడంతో తెలుగు రైతుల పండ్లకు అమ్మకాలు జరగడం లేదు.

వివరాలు 

పెట్టుబడులపై భారం - ఆదాయం లేక నష్టాలు 

ఈ విషయంపై బాటసింగారం పండ్ల మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ, ''కర్ణాటక, మహారాష్ట్రల నుంచి వచ్చే వాహనాలను మార్కెట్‌లోకి అనుమతించడం లేదు. అంతేకాక, తెలుగు రాష్ట్రాల రైతులు పండించిన ఫలాలకు మార్కెట్‌ అవకాశాలు మెరుగుపడేలా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నాం'' అని తెలిపారు. "మొదట్లో మార్కెట్‌ డిమాండ్‌ బాగా ఉండటంతో ఎకరానికి సుమారుగా రూ.6 లక్షల వరకు ఆదాయం వచ్చేది. రూ.5 లక్షల పెట్టుబడి పెట్టిన తర్వాత ఐదో సంవత్సరం నుంచి రైతులకు ఎకరానికి రూ.1 లక్ష లాభంగా మిగిలేది. కానీ ఇప్పుడు మహారాష్ట్ర,కర్ణాటక నుంచి విపరీతంగా డ్రాగన్‌ ఫ్రూట్లు రావడం వల్ల ఆదాయం కేవలం రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల మధ్యకే పరిమితమైంది.

వివరాలు 

తెలంగాణ సరిహద్దుల్లోనే అడ్డుకోవాలి

ఇలా లెక్కిస్తే, రైతులు ఎకరానికి కనీసం రూ.2 లక్షల నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే, ఆ రాష్ట్రాల నుంచి డ్రాగన్‌ పండ్ల వాహనాలను తెలంగాణ సరిహద్దుల్లోనే అడ్డుకోవాలి. అప్పుడే ఇక్కడి రైతుల ఉత్పత్తులకు మార్కెట్‌ కలిగి లాభాలు వచ్చే అవకాశం ఉంది. లేకపోతే ఇద్దరు రాష్ట్రాల రైతులూ తీవ్రంగా నష్టపోతారు. ఈ విషయమై త్వరలోనే తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి విన్నవించనున్నాం'' అని వనిపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తెలుగు రాష్ట్రాల డ్రాగన్‌ ఫ్రూట్‌ రైతుల సంఘం ప్రతినిధి తెలిపారు.