Explainer: యూపీ మొదటి 'గ్యాంగ్స్టర్'; 'అతిక్ అహ్మద్' అరెస్టు, మరణం ఎందుకు సంచలనమయ్యాయి?
ఉత్తర్ప్రదేశ్కు చెందిన గ్యాంగ్స్టర్, రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ హత్యకు గురయ్యారు. ఈ అన్నదమ్ముల హత్య నేపథ్యంలో యూపీలో హై టెన్షన్ వాతావరణ నెలకొంది. రాష్ట్రమంతటా 144సెక్షన్ విధించారు. కొన్నిరోజులుగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన అతిక్ అహ్మద్ ఎవరు? ఆయన అరెస్టు, మరణం ఎందుకు సంచలనయ్యాయి? అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ పోలీసుల కస్డడీలో ఉండగా హత్యకు గురికావడంతో ఈ వార్తకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లగా శనివారం రాత్రి ముగ్గురు జర్నిలిస్టులుగా వచ్చిన అన్నదమ్ములను కాల్చేశారు. దీంతో ఇది సంచలనంగా మారింది. కుమారుడు అసద్ను పోలీసులు ఎన్కౌంటర్ చేసిన రెండు రోజులకే అతిక్ కాల్చివేయబడటం గమనార్హం.
యూపీలోనే మొదటి గ్యాంగ్స్టర్
ఉత్తరప్రదేశ్లో 'గ్యాంగ్స్టర్ చట్టం' కింద కేసు నమోదు చేయబడిన మొదటి వ్యక్తి అతిక్ అహ్మద్. 1979లో అతిక్ అహ్మద్ మొదటిసారి హత్యా ఆరోపణలతో నేర ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లు చెబుతారు. ప్రస్తుతం అతనిపై 100కు పైగా కేసులు ఉన్నట్లు శనివారం యూపీ పోలీసులు చెప్పారు. ప్రధానంగా 2005లో బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్య కేసులో అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ ప్రధాన నిందితులుగా ఉన్నారు. అలాగే ఫిబ్రవరిలో జరిగిన రాజ్ పాల్ హత్య కేసులో కీలక సాక్షి ఉమేష్ పాల్ మర్డర్ కేసులోనూ ఈ ఇద్దరు నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో అరెస్టు అయి పోలీసుల కస్టడీలో ఉన్న క్రమంలోనే ఇద్దరు చనిపోయారు.
అతిక్ అహ్మద్ రాజకీయ జీవితం
అప్పటి వరకు మాఫియా డాన్గా ఉన్న అతిక్ అహ్మద్ 1989లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1989లో స్వతంత్ర అభ్యర్థిగా అలహాబాద్ వెస్ట్ నుంచి ఎమ్మెల్యేగా తొలిసారి గెచిచారు. 1999-2003 సంవత్సరాల మధ్య అతను సోనే లాల్ పటేల్ స్థాపించిన అప్నా దళ్ అధ్యక్షుడిగా ఉన్నారు. తరువాత రెండు శాసనసభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత అహ్మద్ సమాజ్వాదీ పార్టీలో చేరారు. 1996లో వరుసగా నాలుగోసారి ఎస్పీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. మూడేళ్ల తర్వాత అప్నా దళ్ నుండి 2002లో మళ్లీ తన స్థానాన్ని గెలుచుకున్నారు. 2004-2009 వరకు ఉత్తరప్రదేశ్లోని ఫుల్పూర్ నుంతి 14వ లోక్సభకు సమాజ్వాదీ పార్టీ ఎంపీగా అతిక్ ఎన్నికయ్యారు.
అప్పటి నుంచే అతిక్ పతనం మొదలు
2004 సాధారణ ఎన్నికల్లో ఎంపీగా అతిక్ విజయం సాధించాక, తను ఇంతకు ముందు ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన అలహాబాద్ వెస్ట్ స్థానం ఖాళీ అయ్యింది. దీంతో ఆ స్థానంలో అతిక్ తన సోదరుడు అష్రఫ్ను బరిలో నిలిపారు. అయితే ఈ ఎన్నికల్లో రాజ్పాల్ బీఎస్పీ తరఫున విజయం సాధించారు. ఇది జీర్ణించుకోలేని అతిక్ జనవరి 25, 2005న రాజ్ పాల్ను హత్య చేసినట్లు అతని భార్య ఆరోపించింది. దీంతో పోలీసులు ఈ కేసులో మొత్తం ఏడుగురిపై అభియోగాలు మోపారు. ఈ హత్య తర్వాత నుంచి అతిక్ తన ప్రాభవం కోల్పోతూ వచ్చాడు. ఈ కేసులో విపరీతమైన రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో అతిక్ అహ్మద్ 2008లో పోలీసులకు లొంగిపోయి 2012లో విడుదలయ్యాడు.
సమాజ్వాదీ పార్టీ బహిష్కరించిన తర్వాత అగమ్యగోచరం
రాజ్ పాల్ హత్య నేపథ్యంలో 2008లో అతిక్ను సమాజ్వాదీ పార్టీ బహిష్కరించింది. యూపీలో అతనికి ఏ పార్టీ సభ్యత్వం ఇవ్వలేదు. ఎన్నో రాజకీయ విమర్శల మధ్య 2014లో శ్రావస్తి నియోజకవర్గం నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అతిక్కు ఎస్పీ టికెట్ ఇచ్చింది. అయితే ఆ ఎన్నికల్లో బీజేపీకి చెందిన దద్దన్ మిశ్రా చేతిలో దాదాపు లక్ష ఓట్ల తేడాతో అతిక్ ఓడిపోయాడు. ఆ తర్వాత అతిక్ నేరల వల్ల అతనిని అఖిలేష్ దూరం పెట్టారు. 2019లో ఓ దాడి కేసులో అరెస్టు అయిన అతిక్, ఆ ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో వారణాసి నుంచి మోదీపై పోటీ చేసి కేవలం 855 ఓట్లు మాత్రమే పొందగలిగారు.
రాజ్ పాల్ హత్యలో ఆరుగురు నిందితులు మృతి
ఈ ఏడాది ఫిబ్రవరి 24న, ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో రాజ్ పాల్ హత్యలో ప్రధాన సాక్షి అయిన ఉమేష్ పాల్, అతని పోలీసు గార్డు కాల్చి చంపబడ్డారు. దీంతో ఈ కేసులో అతిక్ అహ్మద్, అతని భార్య సహిస్తా పర్వీన్, ఇద్దరు కుమారులు, అతని తమ్ముడు ఖలీద్ అజీమ్ అలియాస్ అష్రఫ్, ఇతరులపై ఫిబ్రవరి 25 న పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఉమేష్ పాల్ హత్య కేసులో అతిక్, అష్రఫ్తో కలిపి మొత్తం ఆరుగురి చనిపోయారు. అందులో కొందరిని పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు.