Page Loader
Indus Waters Treaty: 'మాది సహాయక పాత్ర మాత్రమే': సింధు జలాల ఒప్పందం సస్పెన్షన్‌పై ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా
సింధు జలాల ఒప్పందం సస్పెన్షన్‌పై ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా

Indus Waters Treaty: 'మాది సహాయక పాత్ర మాత్రమే': సింధు జలాల ఒప్పందం సస్పెన్షన్‌పై ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా

వ్రాసిన వారు Sirish Praharaju
May 09, 2025
03:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పాకిస్థాన్‌ను అన్ని దిశల నుంచి ఒత్తిడికి లోనుచేయడానికి చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో భాగంగా సింధు నదీజలాల ఒప్పందాన్ని (Indus Waters Treaty) అమలులో నుంచి నిలిపివేసినట్లు ప్రకటించింది. ఈ వ్యవహారంపై తాజాగా ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా (Ajay Banga) స్పందించారు. "సింధు ఒప్పందం విషయంలో ప్రపంచ బ్యాంక్ ఏ విధంగా జోక్యం చేసుకుంటుందనే విషయమై అనేక ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే అవన్నీ నిరాధారమైనవే. ఈ ఒప్పందానికి సంబంధించి ప్రపంచ బ్యాంక్‌ పాత్ర కేవలం సహాయక స్థాయిలోనే ఉంటుంది" అని ఆయన స్పష్టం చేశారు.

వివరాలు 

భారత పర్యటనలో అజయ్ బంగా 

ప్రస్తుతం అజయ్ బంగా భారత్‌లో పర్యటనలో ఉన్నారు. గురువారం నాడు ఆయన భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. శుక్రవారం ఉదయం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కూడా కలిశారు. అంతేకాకుండా పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతల సమయంలో ఆయన భారత్‌ పర్యటించడమే ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రపంచ బ్యాంక్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తొలి భారతీయ అమెరికన్‌గా, అలాగే మొదటి సిక్కు అమెరికన్‌గా అజయ్ బంగా చరిత్రలో తనదైన స్థానం సంపాదించారు.

వివరాలు 

1960 సెప్టెంబరులో ప్రపంచ బ్యాంక్‌ మధ్యవర్తిత్వంతో  సింధు నదీ జలాల ఒప్పందం 

ఇదిలా ఉండగా, సింధు నదీ జలాల పంపిణీకి సంబంధించి భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య ప్రపంచ బ్యాంక్‌ మధ్యవర్తిత్వంతో 1960 సెప్టెంబరులో ఒక ఒప్పందం కుదిరింది. అప్పటి భారత ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ, పాకిస్థాన్‌ అధ్యక్షుడు జనరల్‌ అయూబ్‌ ఖాన్‌లు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఒప్పందం ప్రకారం తూర్పున ఉన్న రావి, బియాస్, సట్లెజ్‌ అనే ఉపనదులపై భారత్‌కు హక్కులు కల్పించబడినవి. ఈ మూడు నదుల కలిపి సగటు వార్షిక ప్రవాహం 33 మిలియన్ ఎకరాల అడుగులు (MAF)గా నమోదైంది. అలాగే సింధు నదితో పాటు పశ్చిమ ఉపనదులైన జీలం, చీనాబ్‌ నదులపై పాకిస్థాన్‌కు హక్కులు అప్పట్లో అప్పజెప్పబడ్డాయి.

వివరాలు 

ఒప్పందంపై మళ్లీ సమీక్ష అవసరం : భారత్‌

ఇటీవలి కాలంలో ఈ ఒప్పందంపై మళ్లీ సమీక్ష అవసరం ఉందని భారత్‌ తేల్చిచెప్పింది. 1960లో ఈ ఒప్పందం కుదిరిన నాటి నుంచి ఇప్పటి వరకు జనాభాలో,నీటి అవసరాల్లో,పర్యావరణ పరిస్థితుల్లో,భౌగోళిక పరంగా,రాజకీయ అంశాలలో కూడా చాలా మార్పులు చోటుచేసుకున్నాయని భారత్‌ గుర్తుచేసింది. ఈ మార్పులను దృష్టిలో ఉంచుకొని ఒప్పందాన్ని తిరిగి సమీక్షించాల్సిన అవసరం ఉందని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే,ఈ విషయంపై పాకిస్థాన్ మాత్రం నిరసన వ్యక్తం చేస్తూ,ఒప్పందాన్నితాజాగా కొనసాగించాలనే స్థానంలో నిలిచి ఉంది. ఈ పరిణామాల నడుమ ఇటీవల కశ్మీర్‌లోని పహల్గాం వద్ద చోటుచేసుకున్నఉగ్రదాడి నేపథ్యంలో, భారత్‌ సింధు జలాల ఒప్పందాన్ని అమలు చేయడం నిలిపివేస్తూ తుదితీర్పు తీసుకుంది. ఈనిర్ణయం రెండు దేశాల సంబంధాల్లో మరింత ఉద్రిక్తతకు దారి తీసే అవకాశముంది.