
Shubhanshu Shuklas: మరోసారి వాయిదా పడిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్షయాత్ర.. మళ్ళీ ఎప్పుడంటే..?
ఈ వార్తాకథనం ఏంటి
భారత దేశానికి చెందిన వ్యోమగామి శుభాంశు శుక్లా సహా మరో ముగ్గురు అంతరిక్షయాత్రికుల ప్రయాణం మరోసారి వాయిదా పడింది.
తాజాసమాచారం ప్రకారం,భారత కాలమానాన్ని అనుసరించి ఈ నెల 10వ తేదీన సాయంత్రం 5:52 గంటలకు స్పేస్ఎక్స్ వ్యోమనౌక ద్వారా వీరు అంతరిక్ష పయనాన్ని ప్రారంభించనున్నారు.
ఈ ప్రయాణంలో భాగంగా వారు భూమి ఉపరితలానికి బయటి భాగమైన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో మొత్తం 14 రోజుల పాటు గడపనున్నారు.
యాక్సియం-4 పేరుతో నిర్వహిస్తున్న ఈ అంతరిక్ష మిషన్లో శుభాంశుశుక్లాతో పాటు అమెరికా, పోలండ్,హంగరీ దేశాలకు చెందిన మరో ముగ్గురు వ్యోమగాములు పాల్గొంటున్నారు.
నిజానికి వీరి ప్రయాణం మే 29ననే జరగాల్సింది. అయితే కొన్ని కారణాల వల్ల దాన్ని జూన్ 8కి వాయిదా వేశారు.
వివరాలు
ఫ్లోరిడాలో అంతరిక్ష ప్రయోగ కేంద్రం
ఇప్పుడు మరోసారి ఆ తేది మారి జూన్ 10గా ఖరారయ్యింది.
ఈ విషయాన్ని మంగళవారం ఫ్లోరిడాలో ఉన్న అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి నిర్వహించిన వర్చువల్ మీడియా సమావేశంలో అధికారికంగా ప్రకటించారు.
ఈ సందర్భంగా శుభాంశు శుక్లా మాట్లాడుతూ, ''భారతదేశంలోని ప్రతీ ఒక్కరూ ఈ యాత్రను ప్రత్యక్షంగా వీక్షించాలని కోరుతున్నాను. మన భవిష్యత్తు కోసం సాహసభరితమైన కలలు కనాలని నేను కోరుతున్నాను'' అని భావోద్వేగంగా పేర్కొన్నారు.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న అనంతరం, భారత ప్రధాని నరేంద్ర మోదీతో వారు మాట్లాడే అవకాశముండవచ్చని కూడా వెల్లడించారు.
దీనిని ప్రస్తావిస్తూ, ''భారతదేశానికి చెందిన ప్రముఖ వ్యక్తితో మేము సంభాషించనున్నాం'' అని తెలిపారు.
వివరాలు
140 కోట్ల మంది భారతీయుల ఆశలు, కలలు
ఇంతకే కాకుండా, భారతదేశంలోని పాఠశాల విద్యార్థులు, విద్యావేత్తలు, అంతరిక్ష పరిశ్రమలో పనిచేస్తున్న సభ్యులతో కూడా ఆన్లైన్ ద్వారా ముచ్చటించే ప్రణాళికను పంచుకున్నారు.
"నేను కేవలం సాంకేతిక పరికరాలనే కాదు, 140 కోట్ల మంది భారతీయుల ఆశలు, కలలు, ఆశయాలను కూడా నాతో పాటు తీసుకెళుతున్నాను'' అని గర్వంగా తెలిపారు.
భారతీయ సృజనాత్మకత, నవోన్మేషాలను ప్రతిబింబించేందుకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ రూపొందించిన కొన్ని ప్రత్యేక కళాఖండాలను శుక్లా ఐఎస్ఎస్కు తీసుకెళుతున్నారు.
అంతేకాకుండా, 1984లో రష్యా వ్యోమనౌక ద్వారా అంతరిక్షానికి వెళ్లిన తొలి భారతీయుడు రాకేశ్ శర్మ జ్ఞాపకార్థంగా, ఆయనకు సంబంధించిన ఒక జ్ఞాపకాన్ని కూడా శుభాంశు శుక్లా తనతో పాటు రోదసిలోకి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.