
#NewsBytesExplainer: గగన వీధిలో ఘన చరిత్ర సృష్టిస్తున్న తెలుగువారు వీరే… !
ఈ వార్తాకథనం ఏంటి
భారత గగనయాన్ కార్యక్రమంలో కీలక పాత్ర పోషిస్తున్న శుభాన్షు శుక్లా ఇప్పటికే భూమి కక్ష్యలోకి ప్రవేశించారు. గతంలో భారతీయుల్లో మొదటిగా అంతరిక్షాన్ని అనుభవించిన ఎయిర్ ఫోర్స్ పైలట్ రాకేశ్ శర్మ తరువాత, భారతీయ మూలాలు కలిగిన కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ లాంటి అమెరికన్ వ్యోమగాములు నాసా ద్వారా అంతరిక్షయాత్రలు చేశారన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు నాసా చేపట్టిన స్పేస్ మిషన్లో భారతీయ పౌరుడిగా శుభాన్ష్ శుక్లా రోదసిలోకి వెళ్లిన రెండో వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఈ అరుదైన ఘట్టంలో మన భారతీయుల ఘనతను మరిచిపోలేం.
వివరాలు
గగన వీధిలో తెలుగువారి ఘన చరిత్ర..
అన్ని రంగాల్లోనూ విశేష కీర్తిని అందుకున్న తెలుగువారు, గగనతలాన్ని కూడా అధిరోహించారు. భారత్ సంతకంతో అంతరిక్ష యానాలు ఇప్పటికీ పరిమితంగానే ఉన్నా, అమెరికాలో నాసా వేదికగా మనవాళ్లు విశేష విజయాలను సాధిస్తున్నారు. అంతరిక్ష పరిశోధనకు కేంద్రబిందువుగా మారిన అమెరికాలో వివిధ మార్గాల ద్వారా స్పేస్కు చేరుకోవచ్చు. ఇప్పటికే ఇద్దరు తెలుగువారు భూమిని అంతరిక్షం నుంచి వీక్షించే అవకాశం పొందగా, మరో యువతి దానికి సిద్ధమవుతోంది. ప్రైవేట్ స్పేస్ ప్రోగ్రాముల ద్వారా జరిగిన రెండు యాత్రలతోపాటు, పాలకొల్లుకు చెందిన జాహ్నవి దంగేటి 2029లో వ్యోమగామిగా స్పేస్కు వెళ్లేందుకు సిద్దమవుతోంది. ఇప్పటివరకూ ఎవరెవరు వెళ్లారంటే..
వివరాలు
భూమిని చుట్టేసిన బండ్ల శిరీష
బండ్ల శిరీష తెలుగువారి గర్వకారణం.తెనాలికి చెందిన ఆమె,కల్పనా చావ్లా తరువాత అంతరిక్ష యాత్ర చేసిన రెండో భారతీయ మహిళగా నిలిచారు. సునీతా విలియమ్స్ అమెరికన్ పౌరురాలు కావడంతో,భారతీయ మహిళగా అంతరిక్షం చుట్టిన ఘనత శిరీషకు దక్కింది. చిన్నతనంలో హైదరాబాద్లో పెరిగిన శిరీష,ఆ తర్వాత కుటుంబంతో కలిసి అమెరికాలోని హ్యూస్టన్కు వెళ్లారు. అక్కడ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి,మాస్టర్స్ కూడా పూర్తి చేశారు.అనంతరం ఆమె Virgin Galactic అనే ప్రైవేట్ స్పేస్ సంస్థలో చేరి, ప్రస్తుతం ఆ సంస్థలో వైస్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్నారు. 2021లో జరిగిన Unity 22 మిషన్లో శిరీష స్పేస్ టూరిస్ట్గా పాల్గొన్నారు.ఇది సబ్ ఆర్బిటల్ స్పేస్ మిషన్గా నడిచింది.
వివరాలు
గగనయానం చేసిన తోటకూర గోపీచంద్..
ఈ యాత్ర ద్వారా జీరో గ్రావిటీని అనుభవించిన రెండో భారతీయ మహిళగా,తొలి తెలుగు వ్యక్తిగా శిరీష బండ్ల చరిత్రలో నిలిచారు. గుంటూరు జిల్లాకే కాకుండా, విజయవాడకు చెందిన గోపీచంద్ తోటకూర కూడా అంతరిక్షాన్ని తాకారు. ప్రపంచ ప్రముఖ కంపెనీ అమెజాన్కు అధిపతిగా ఉన్న జెఫ్ బెజోస్కి చెందిన బ్లూ ఒరిజిన్ సంస్థ ద్వారా న్యూషెపర్డ్ 25 వ్యోమ నౌకలో ఆయన స్పేస్ యాత్ర చేశారు. కమర్షియల్ పైలట్ అయిన గోపీచంద్ ప్రస్తుతం అమెరికాలో ఓ వెల్నెస్ కంపెనీని నిర్వహిస్తున్నారు. 2024లో జరిగిన న్యూషెపర్డ్ మిషన్లో భాగంగా ఈ అంతరిక్ష ప్రయాణాన్ని పూర్తి చేశారు.
వివరాలు
జాహ్నవి దంగేటి కొత్త చరిత్ర - స్పేస్లోకి వెళ్లనున్న తొలితెలుగు ఆస్ట్రోనాట్
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన జాహ్నవి దంగేటి అనే 23 ఏళ్ల యువతి 2029లో అంతరిక్షంలోకి వెళ్లనుంది. అమెరికాకు చెందిన Titan Space Industries అనే ప్రైవేట్ సంస్థ చేపట్టే స్పేస్ మిషన్లో, ఆమె Astronaut Candidate (ASCAN)గా ఎంపికయ్యారు. అంతకుముందే NASA నిర్వహించిన ఇంటర్నేషనల్ ఎయిర్ & స్పేస్ ప్రోగ్రామ్ను పూర్తి చేసిన తొలి భారతీయురాలిగా జాహ్నవి గుర్తింపు పొందింది. ఇప్పటివరకూ స్పేస్కి వెళ్లిన మనవాళ్లు "స్పేస్ టూరిస్టులు" మాత్రమే. కానీ జాహ్నవి వ్యోమగామిగా అధికారికంగా మిషన్లో పాల్గొననుంది. తదుపరి మూడు సంవత్సరాల పాటు ఆమె Titan Space సంస్థ ద్వారా వ్యోమగామి శిక్షణ పొందనున్నారు.
వివరాలు
తెలుగు యువతలో STEMపై ఉన్న ఆసక్తే కారణం
తెలుగు రాష్ట్రాల విద్యార్థుల్లో ప్రాథమిక స్థాయిలోనే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ (STEM) పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఇతర రాష్ట్రాల యువతతో పోలిస్తే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల్లో ఈ అభిరుచి బాగా కనిపిస్తుంది. IITల్లో చేరడం, అమెరికాలో ఉన్నత విద్య చదవడం వంటి అవకాశాల్లో తెలుగు యువత ముందుండటం ఇందుకు నిదర్శనం. ఇదే ఆసక్తి తెలుగు వారికి అంతరిక్ష పరిశోధనల వైపు దారి చూపుతోంది. ఆకాశాన్ని అధిగమించాలన్న తపనతో ఈ యువత అంతరిక్ష గమనాలకు సిద్ధమవుతోంది.