Page Loader
Champions Trophy: భారత్ చేతిలో ఓడిన తర్వాత కూడా పాకిస్థాన్ సెమీ-ఫైనల్‌కు వెళ్లే అవకాశం..! ఎలా అంటే..
భారత్ చేతిలో ఓడిన తర్వాత కూడా పాకిస్థాన్ సెమీ-ఫైనల్‌కు వెళ్లే అవకాశం..! ఎలా అంటే..

Champions Trophy: భారత్ చేతిలో ఓడిన తర్వాత కూడా పాకిస్థాన్ సెమీ-ఫైనల్‌కు వెళ్లే అవకాశం..! ఎలా అంటే..

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 24, 2025
12:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన వన్డే మ్యాచ్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడగా, చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను టీమిండియా 6 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. విరాట్ కోహ్లీ (100 నాటౌట్; 111 బంతుల్లో 7 ఫోర్లు) శతకంతో అదరగొట్టడంతో 242 పరుగుల లక్ష్యాన్ని భారత్ 42.3 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. ఈ విజయంతో భారత జట్టు సెమీఫైనల్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది. ఈ పరాజయంతో పాకిస్థాన్ టోర్నమెంట్ నుంచి దాదాపుగా నిష్క్రమించినట్లేనని చెప్పొచ్చు. అయితే, పాకిస్థాన్ సెమీస్ అవకాశాలు న్యూజిలాండ్ గెలుపోటములపై ఆధారపడి ఉన్నాయి.

వివరాలు 

పాకిస్థాన్ సెమీస్‌కు వెళ్లాలంటే? 

పాకిస్థాన్ జట్టు సెమీఫైనల్‌కు అర్హత సాధించాలంటే, ముందుగా గ్రూప్ దశలో బంగ్లాదేశ్ జట్టును ఓడించాల్సి ఉంటుంది. అంతేకాక, నెట్ రన్ రేట్‌ను మెరుగుపరచడం కోసం పాకిస్థాన్ భారీ విజయం సాధించాల్సిన అవసరం ఉంది. అదనంగా, న్యూజిలాండ్‌తో జరగనున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్, భారత్ జట్లు విజయం సాధించాలి. అలా జరిగితే, టీమిండియా సెమీఫైనల్‌కు చేరుకుంటుంది. మిగిలిన మూడు జట్లు ఒక్కో విజయంతో సమాన పాయింట్లను సాధిస్తాయి. ఆ సందర్భంలో, రన్ రేట్ ఆధారంగా సెమీఫైనల్‌కు అర్హత కలిగిన జట్టును నిర్ణయిస్తారు. రన్ రేట్ పరంగా పాకిస్థాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లలో పాకిస్థాన్ ముందంజలో ఉంటేనే సెమీస్‌కు వెళ్లే అవకాశం ఉంటుంది.

వివరాలు 

పాకిస్థాన్‌కు అవకాశాలేమున్నాయి? 

ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే, పాకిస్థాన్ జట్టు సెమీస్‌కు చేరుకునే అవకాశాలు చాలా తక్కువ అని చెప్పవచ్చు. న్యూజిలాండ్ జట్టు ఇప్పటికే సెమీఫైనల్ బెర్త్‌ను లక్ష్యంగా పెట్టుకుంది. పాకిస్థాన్‌పై విజయంతో ఉత్సాహంగా ఉన్న కివీస్ ఆటగాళ్లు, సోమవారం బంగ్లాదేశ్‌తో తలపడనున్నారు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ విజయం సాధిస్తే, గ్రూప్-ఏ నుంచి భారత్‌తో పాటు న్యూజిలాండ్ కూడా సెమీఫైనల్‌కు ప్రవేశిస్తుంది. ఫలితంగా, ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు నిష్క్రమించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం గ్రూప్-ఏలో పాయింట్ల పట్టికను పరిశీలిస్తే, భారత జట్టు అగ్రస్థానంలో కొనసాగుతోంది.

వివరాలు 

గ్రూప్-ఏ పాయింట్ల పట్టిక 

రెండు మ్యాచ్‌లు ఆడిన భారత్, రెండింటిలోనూ గెలిచి సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. భారత్ రన్ రేట్ 0.647గా ఉంది.న్యూజిలాండ్ ఒక మ్యాచ్‌లో విజయం సాధించి రెండో స్థానంలో నిలిచింది. కివీస్ రన్ రేట్ 1.200, బంగ్లాదేశ్ జట్టు రన్ రేట్ -0.408గా ఉండగా, రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన పాకిస్థాన్ జట్టు రన్ రేట్ -1.087గా ఉంది. ఈ నేపథ్యంలో,పాకిస్థాన్ జట్టు సెమీఫైనల్‌కు చేరాలంటే, బంగ్లాదేశ్‌పై భారీ విజయం సాధించాలి. అదే సమయంలో,న్యూజిలాండ్ జట్టు భారత్ చేతిలో భారీ పరాజయం చవిచూడాల్సి ఉంటుంది. మరోవైపు,బంగ్లాదేశ్ కూడా న్యూజిలాండ్‌పై విజయం సాధించాల్సిన అవసరం ఉంది. మొత్తంగా,పాకిస్థాన్ సెమీఫైనల్‌కు చేరే మార్గం క్లిష్టంగా మారింది.న్యూజిలాండ్‌-బంగ్లాదేశ్ మ్యాచ్ ఫలితంపై అన్నీ ఆధారపడి ఉన్నాయి.