LOADING...
Rohit Sharma: రిటైర్మెంట్ ఊహాగానాలపై హిట్ మ్యాన్ క్లారిటీ
రిటైర్మెంట్ ఊహాగానాలపై హిట్ మ్యాన్ క్లారిటీ

Rohit Sharma: రిటైర్మెంట్ ఊహాగానాలపై హిట్ మ్యాన్ క్లారిటీ

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 10, 2025
08:39 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ అనంతరం టీమిండియా కీలక ఆటగాళ్లు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారనే వార్తలు జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా, భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ వన్డే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నాడనే ఊహాగానాలు ఎక్కువయ్యాయి. గత సంవత్సరం టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత అతను అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించినట్లుగానే, ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత వన్డేలకు కూడా వీడ్కోలు పలుకుతాడని అందరూ భావించారు. అయితే ఈ పుకార్లకు స్వయంగా రోహిత్ శర్మ తెరదించాడు. రిటైర్మెంట్ పై వస్తున్న ఊహాగానాలకు హిట్ మ్యాన్ క్లారిటీ ఇచ్చాడు. వన్డే క్రికెట్ నుంచి తాను రిటైర్ అవ్వడం లేదని స్పష్టం చేశాడు.

వివరాలు 

"నేను వన్డేలు ఆడటాన్ని కొనసాగిస్తాను": రోహిత్ 

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ అనంతరం విలేకరుల సమావేశంలో రోహిత్ శర్మ మాట్లాడుతూ - "నేను వన్డేలు ఆడటాన్ని కొనసాగిస్తాను. ప్రస్తుతం నా భవిష్యత్తుకు ఎలాంటి ప్రణాళికలు లేవు. కాబట్టి రిటైర్మెంట్ గురించి ఎలాంటి అపోహలు నమ్మవద్దు, ఇలాంటి ప్రచారం చేయొద్దు" అని మీడియాకు విజ్ఞప్తి చేశాడు. అతని ఈ ప్రకటన తర్వాత హాలులో ఉన్నవారంతా చప్పట్లు కొడుతూ సంబరాలు చేసుకున్నారు. హిట్ మ్యాన్ ఈ నిర్ణయం ఫ్యాన్స్‌కు మరింత ఆనందాన్ని కలిగించింది. గతంలో అనేక మీడియా నివేదికలు,"భారత్ ఛాంపియన్స్ ట్రోఫీని ఓడిపోతే రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఖాయం. కానీ గెలిస్తే అతను కొనసాగించనున్నాడు" అని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో, రోహిత్ టీమిండియాను ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిపినందుకు అతని కెప్టెన్సీపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

వివరాలు 

రెండో భారత కెప్టెన్‌గా రోహిత్ హిస్టరీ..

ఈ టోర్నమెంట్ కోసం రోహిత్ శర్మపై గణనీయమైన ఒత్తిడి ఉంది.ఇటీవల,స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో టీమిండియా ఓడిపోయింది. ఆతర్వాత ఆస్ట్రేలియా పర్యటనలోనూ టెస్ట్ సిరీస్‌ను కోల్పోయింది. ఈ పరాజయాల నేపథ్యంలో రోహిత్ కెప్టెన్సీపై ప్రశ్నలు లేవనెత్తాయి.అప్పటి నుంచే అతని రిటైర్మెంట్ గురించి ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే,ఈవార్తలకు తెరదించుతూ,రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిల్‌ను గెలుచుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి,భారత్ మూడోసారి ఈట్రోఫీని గెలుచుకుంది. దీనితో,భారత జట్టు ఈ టోర్నమెంట్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది. రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఇది అతనికి రెండవ ఐసీసీ ట్రోఫీ.దీంతో,ఒకటి కంటే ఎక్కువ ఐసీసీ ట్రోఫీలు గెలుచుకున్న రెండో భారత కెప్టెన్‌గా రోహిత్ హిస్టరీ క్రియేట్ చేశాడు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మీడియాతో మాట్లాడుతున్న రోహిత్