Page Loader
Shubman Gill: కెప్టెన్‌గా గిల్‌పై ఇప్పుడు బాధ్యత పెరిగింది..ఈ సమయంలో అతడి ప్రవర్తనే చాలా కీలకం: గావస్కర్‌ 
Shubman Gill: కెప్టెన్‌గా గిల్‌పై ఇప్పుడు బాధ్యత పెరిగింది: గావస్కర్‌

Shubman Gill: కెప్టెన్‌గా గిల్‌పై ఇప్పుడు బాధ్యత పెరిగింది..ఈ సమయంలో అతడి ప్రవర్తనే చాలా కీలకం: గావస్కర్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
May 26, 2025
12:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

టెస్టు ఫార్మాట్‌ నుంచి రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో, భారత క్రికెట్ జట్టుకు యువ ఆటగాడు శుభమన్ గిల్ నూతన కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. ఇంగ్లండ్ టూర్ కోసం ఎంపిక చేసిన జట్టును బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ స్పందిస్తూ, గిల్‌కు ముఖ్యమైన సూచనలు చేశాడు. కొత్త కెప్టెన్‌గా గిల్ ప్రవర్తన ఎంతో కీలకమని ఆయన వ్యాఖ్యానించాడు.

వివరాలు 

మాజీ సారథులు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీపై ప్రశంసలు 

''భారత జట్టు సారథిగా బాధ్యతలు స్వీకరించిన వ్యక్తిపై సహజంగానే గణనీయమైన ఒత్తిడి ఉంటుంది. జట్టులో సాధారణ సభ్యుడిగా ఉన్నప్పటికీ, కెప్టెన్‌గా వ్యవహరించడంలో స్పష్టమైన తేడా ఉంటుంది. ఆటగాడిగా ఉన్నప్పుడు సహచరులతో స్నేహంగా ముచ్చటించవచ్చు. కానీ కెప్టెన్‌ అయ్యాక, ఇతర ఆటగాళ్లందరినీ గౌరవించేలా, మార్యాదగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంటుంది. ఒక కెప్టెన్‌కి ఆటలో ప్రదర్శన కంటే, అతడి ప్రవర్తన మరింత ముఖ్యమైనది'' అని గావస్కర్ పరోక్షంగా గిల్‌కు కీలక సూచన ఇచ్చాడు. కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత శుభ్‌మన్ గిల్ స్పందిస్తూ,మాజీ సారథులు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అలాగే అశ్విన్‌లపై ప్రశంసల వర్షం కురిపించాడు. ''విదేశాల్లో ఎలా ఆడాలి,ఎలా విజయాలను సాధించాలి అనే విషయాల్లో రోహిత్,విరాట్,అశ్విన్ నాకు ప్రేరణ'' అని గిల్ చెప్పాడు.

వివరాలు 

18 మందితో కూడిన టెస్టు జట్టు ప్రకటించిన బీసీసీఐ 

ఇక జూన్ 20 నుంచి భారతదేశం-ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కు గిల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయగా, రిషభ్ పంత్‌కు వైస్ కెప్టెన్‌. శనివారం బీసీసీఐ మొత్తం 18 మందితో కూడిన టెస్టు జట్టును ప్రకటించింది. ఐపీఎల్‌లో తన శైలి ఆటతో ఆకట్టుకుంటున్న సాయి సుదర్శన్‌తో పాటు, మరికొందరు యువ ఆటగాళ్లు కూడా ఈ సిరీస్‌కి జట్టులో చోటు దక్కించుకున్నారు.