
Earthquake : అలాస్కాలో 6.2 తీవ్రతతో ప్రకంపనలు.. సునామీ హెచ్చరిక..!
ఈ వార్తాకథనం ఏంటి
అలాస్కాలో 6.2 తీవ్రత గల భారీ భూకంపం సంభవించింది. అలాగే తజాకిస్తాన్లో కూడా వరుస భూప్రకంపనలు నమోదు అయ్యాయి. ఇదే విధంగా భారత్లోని పలు రాష్ట్రాల్లో స్వల్ప భూప్రకంపనలు నమోదయ్యాయి. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) విడుదల చేసిన సమాచారం ప్రకారం, అలాస్కాలో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేల్పై 6.2 తీవ్రతతో నమోదు అయినట్టు వెల్లడించారు. భూకంప కేంద్రం భూమికి 48 కిలోమీటర్ల లోతులో ఉన్నట్టు పేర్కొన్నారు. ఇదే ప్రాంతంలో జూలై 17న 7.3 తీవ్రత గల మరో భారీ భూకంపం సంభవించిందని, అది 36 కిలోమీటర్ల లోతులో నమోదు అయినట్టు వివరించారు.
వివరాలు
తజకిస్తాన్లో 4.6 తీవ్రతతో భూప్రకంపనలు
ఒక నివేదిక ప్రకారం, అలాస్కాలో సంభవించిన ఈ భూకంపం నేపథ్యంలో అలాస్కా తీరప్రాంతాల కోసం సునామీ హెచ్చరికలు జారీ చేసినట్టు తెలిపారు. అమెరికా జాతీయ వాతావరణ శాఖ వెల్లడించిన ప్రకారం, తీరప్రాంతాల్లో ఉన్న ప్రజలు వెంటనే ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాలని, తీరప్రాంతాలు,జలమార్గాలను విడిచిపెట్టాలని హెచ్చరించినట్టు పేర్కొన్నారు. మరోవైపు తజకిస్తాన్లో 4.6 తీవ్రతతో భూప్రకంపనలు సంభవించాయి. ఇది భూమికి 23 కిలోమీటర్ల లోతులో చోటు చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. అంతకుముందు జూలై 18న 3.8 తీవ్రతతో, జూలై 12న 4.8 తీవ్రతతో భూప్రకంపనలు చోటు చేసుకున్నట్టు తెలిపారు. ఈ భూకంపాలు 160 కిలోమీటర్ల లోతులో నమోదయ్యాయని వివరించారు.
వివరాలు
కిష్త్వార్ జిల్లా ప్రాంతంలో రిక్టర్ స్కేల్పై 3.1 తీవ్రతతో ప్రకంపనలు
ఇక భారత్కు సంబంధించి, జమ్ముకశ్మీర్లోని కిష్త్వార్ జిల్లా ప్రాంతంలో రిక్టర్ స్కేల్పై 3.1 తీవ్రత గల భూప్రకంపనులు నమోదయ్యాయి. ఈ భూప్రకంపనల కేంద్రం భూమికి 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్టు వెల్లడించారు. అదే విధంగా అరుణాచల్ ప్రదేశ్లోని అప్పర్ సుబన్సిరి జిల్లాలో 3.4 తీవ్రత గల భూప్రకంపనులు రాత్రి సమయంలో నమోదయ్యాయని, భూమికి 5 కిలోమీటర్ల లోతులో కేంద్రం ఉన్నట్టు వెల్లడించారు.