LOADING...
Iran: విశ్వసనీయ హామీ ఇస్తే తప్ప చర్చలకు అర్థం ఉండదు: అమెరికాతో చర్చలు జరపడానికి షరతులు విధించిన ఇరాన్‌
అమెరికాతో చర్చలు జరపడానికి షరతులు విధించిన ఇరాన్‌

Iran: విశ్వసనీయ హామీ ఇస్తే తప్ప చర్చలకు అర్థం ఉండదు: అమెరికాతో చర్చలు జరపడానికి షరతులు విధించిన ఇరాన్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 04, 2025
11:30 am

ఈ వార్తాకథనం ఏంటి

అణుశక్తి ఒప్పందంపై అమెరికాతో చర్చలు జరిపేందుకు ఇరాన్‌ కొన్ని ముఖ్యమైన షరతులను ముందుంచింది. భవిష్యత్తులో అమెరికా, ఇజ్రాయెల్‌ పక్షాల నుండి తమపై ఎలాంటి దురాక్రమణలు జరగకూడదని స్పష్టంగా పేర్కొంది. ఈ విషయాన్ని భారతదేశంలో ఉన్న ఇరాన్‌ రాయబారి ఇరాజ్‌ ఎలాహి ఓ ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. తమ దేశంపై అమెరికా, ఇజ్రాయెల్‌ వర్గాల నుండి ఇకపై ఎలాంటి దుష్ప్రవర్తనలు జరగకూడదన్న విశ్వసనీయ హామీ ఇవ్వగలిగితేనే, అణుఒప్పందంపై చర్చలు కొనసాగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. లేకపోతే, అలాంటి చర్చలకు ఎలాంటి విలువ ఉండదని వ్యాఖ్యానించారు.

వివరాలు 

అణ్వాయుధ వ్యాప్తి నిరోధ ఒప్పందంపై సంతకం చేయని  ఇజ్రాయెల్‌ 

ఇటీవలి కాలంలో ఇజ్రాయెల్‌ చేపట్టిన 'ఆపరేషన్‌ రైజింగ్‌ లయన్‌' అనే దాడిపై కూడా ఆయన మాట్లాడారు. ఈ దాడుల్లో ప్రధానంగా ఇరాన్‌ అణుశక్తి కేంద్రాలు లక్ష్యంగా ఉన్నాయని వివరించారు. టెల్‌అవీవ్‌ వద్ద ఇప్పటికీ అణ్వాయుధాలు ఉన్నప్పటికీ, ఇజ్రాయెల్‌ ఇప్పటివరకు అణ్వాయుధ వ్యాప్తి నిరోధ ఒప్పందంపై సంతకం చేయలేదని ఎలాహి ఆరోపించారు. అటువంటి దేశం తామెందుకు అణ్వాయుధాలు కలిగి ఉండకూడదని చెప్పడం అన్యాయమని, అదే నెపంతో తమపై దాడులు చేయడం పూర్తిగా తప్పని అన్నారు. ఈ దాడుల్లో తమ దేశానికి చెందిన అనేక మంది శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, సైనిక అధికారులు, ఇంకా సాధారణ ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. ఇది అంతర్జాతీయ చట్టాలను, ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి నిబంధనలను అతిక్రమించడమేనని ఆయన ఆక్షేపించారు.

వివరాలు 

సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించేందుకు సిద్ధం

ఇంకా, అమెరికా మూడు అణుశక్తి కేంద్రాలపై చేసిన దాడులను బుద్ధిహీన చర్యలుగా వర్ణించారు. చర్చలు సాగుతున్న సమయంలో ఇజ్రాయెల్‌తో కలసి అమెరికా ఇలాంటి దాడులు చేయడం నైతికంగా తప్పుడు చర్యగా పేర్కొన్నారు. ఇది దౌత్య సంబంధాలకు మచ్చ పెట్టేదిగా అభివర్ణించారు. అదే సమయంలో, ఈ దాడులపై అమెరికా తీసుకున్న వైఖరిని కూడా ఆయన విమర్శించారు. ఇరాన్‌ తన చరిత్రలో ఏ ఇతర దేశంపైనా దాడి చేయలేదని స్పష్టం చేశారు. గాజా అంశంలో కూడా తాము శాంతియుత దృక్పథాన్ని అనుసరించామని గుర్తుచేశారు. తాము ఎప్పుడూ దౌత్యానికి ప్రాధాన్యం ఇస్తామని, సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.