Page Loader
Imran Khan: పహల్గామ్ ఉగ్రదాడి ఘటన 'తీవ్రంగా కలిచివేసింది': ఇమ్రాన్ ఖాన్
పహల్గామ్ ఉగ్రదాడి ఘటన 'తీవ్రంగా కలిచివేసింది': ఇమ్రాన్ ఖాన్

Imran Khan: పహల్గామ్ ఉగ్రదాడి ఘటన 'తీవ్రంగా కలిచివేసింది': ఇమ్రాన్ ఖాన్

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 30, 2025
08:53 am

ఈ వార్తాకథనం ఏంటి

పహల్గాంలో చోటుచేసుకున్న ఉగ్రదాడిపై పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన తన మనసును బాగా కలచివేసిందని పేర్కొన్న ఆయన, ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారు ఎదుర్కొన్న విషాద పరిస్థితిని తలుచుకుంటే హృదయం కలవరపడుతోందన్నారు. దాడిలో మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్టు అన్నారు. ప్రస్తుతం పాకిస్తాన్‌లోని జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్, ఈ వ్యాఖ్యలను మంగళవారం ఎక్స్‌ (ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఇమ్రాన్ ఖాన్ చేసిన ట్వీట్ 

వివరాలు 

మోడీ సర్కార్ పాకిస్తాన్‌పై ఆరోపణలు

ఈ దాడితో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రభుత్వం కూడా బాధ్యతాయుతంగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. గతంలో పుల్వామా దాడి జరిగినప్పుడు కూడా భారత్ పాకిస్తాన్‌ను నిందించిందని గుర్తుచేశారు. ఇప్పుడు మళ్లీ అదే తరహాలో మోడీ సర్కార్ పాకిస్తాన్‌పై ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. తాను ప్రధాని పదవిలో ఉన్న సమయంలో దర్యాప్తుకు పూర్తి స్థాయిలో సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పినప్పటికీ భారత్ ముందుకు రాలేదని వెల్లడించారు. 2019లో ఎలా జరిగిందో, ఇప్పుడు కూడా అలానే జరుగుతోందని వ్యాఖ్యానించిన ఇమ్రాన్ ఖాన్, భారత్ దుస్సాహసానికి పాల్పడితే పాకిస్తాన్ కూడా అణు స్థాయిలో ప్రతిస్పందించేందుకు సిద్ధంగా ఉందని హెచ్చరించారు.

వివరాలు 

నవాజ్ షరీఫ్,ఆసిఫ్ అలీ జర్దారీలపై తీవ్ర విమర్శలు

రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగకుండా చూసే విధంగా భారతదేశం నిష్పక్షపాతంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన విన్నవించారు. తాము శాంతికి ప్రాధాన్యతనిస్తామని స్పష్టం చేసిన ఇమ్రాన్, దీనిని కొంతమంది పిరికితనంగా అభివర్ణించడం సరికాదని అన్నారు. ఇదిలా ఉండగా, పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, ప్రస్తుత అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీలపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. స్వార్థపరులైన వారినుంచి శ్రేయస్సును ఆశించడం అమాయకత్వమని అన్నారు. ఈ నాయకుల అక్రమ సంపదలు, వ్యాపార లావాదేవీలు విదేశాల్లో ఉన్న కారణంగా వారు భారతదేశానికి వ్యతిరేకంగా ఏ మాటలూ చెప్పరని, అందుకే ప్రస్తుతం వారు మౌనం పాటిస్తున్నారని ఆరోపించారు.

వివరాలు 

దాడి అనంతరం భారత చర్యలు 

ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం రావల్పిండీలోని అడియాలా జైల్లో ఉన్నారు. 2023లో మొదలైన వివిధ న్యాయ కేసుల నేపథ్యంలో ఆయన జైలు జీవితం కొనసాగిస్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడిలో మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలామంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన అనంతరం భారత ప్రభుత్వం పాకిస్తాన్‌పై పలు కఠిన చర్యలు తీసుకుంది. సింధు నదిపై ఉన్న జలాలను నిలిపివేసింది. పాకిస్తాన్ పౌరులకు వీసాలను రద్దు చేసింది. అటారీ సరిహద్దును పూర్తిగా మూసివేసింది. పాకిస్థాన్‌కు చెందిన యూట్యూబ్ ఛానళ్లను నిషేధించింది. ఇలా దశల వారీగా పాక్‌పై భారత్ తీవ్ర నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు సాగుతోంది.