
China: సార్క్ కు పోటీగా కొత్త ప్రాంతీయ కూటమి కోసం పాకిస్తాన్, చైనా చర్చలు
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణాసియా దేశాలతో కలిసి చైనా, పాకిస్థాన్లు కలిసి ఓ కొత్త కూటమిని ఏర్పాటు చేయాలన్న యత్నాలను ప్రారంభించినట్లు సమాచారం. ఈ కొత్త గ్రూపును ప్రధానంగా సార్క్ (దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం)కు ప్రత్యామ్నాయంగా తీసుకురావాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పాక్ వార్తాపత్రిక "ది ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్" దౌత్యవేత్తల ఉల్లేఖనంతో కథనం వెలువరించినట్లు పీటీఐ పేర్కొంది. ఈ కొత్త కూటమి ఏర్పాటుపై ఇప్పటికే చైనా-పాకిస్థాన్ మధ్య చర్చలు కొనసాగుతున్నాయని, ఈ సరికొత్త సంస్థ సార్క్ స్థానాన్ని భర్తీ చేస్తుందని పాక్ పత్రిక పేర్కొంది. ప్రస్తుతం సార్క్ సభ్యదేశాలుగా భారత్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, మాల్దీవులు, శ్రీలంక దేశాలు ఉన్నాయి.
వివరాలు
కున్మిన్ నగరంలో చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ ప్రతినిధుల సమావేశం
ఈ కొత్త కూటమి ఏర్పాటుకు భాగంగా ఇటీవల చైనాలోని కున్మిన్ నగరంలో చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ ప్రతినిధులు సమావేశమయ్యారు. సార్క్లోని మిగిలిన దేశాలను కూడా ఈ కొత్త బృందంలోకి ఆహ్వానించాలన్న లక్ష్యంతో చర్చలు సాగినట్లు సమాచారం. అయితే ఈ ప్రచారాలను బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఖండించింది. ఇది ఏ రాజకీయ సమావేశం కాదు, కొత్త కూటమి ఏర్పడే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ''మేము ఏ కొత్త అలయన్స్ ఏర్పాటుచేయడం లేదు'' అని బంగ్లాదేశ్ విదేశాంగశాఖ సలహాదారు ఎం. తౌఫిద్ హోస్సైన్ స్పష్టం చేశారు. అయితే, భారత్ను ఈ కొత్త గ్రూపులోకి ఆహ్వానించే అవకాశముందని భావిస్తున్నారు. అంతేగాక, మాల్దీవులు, శ్రీలంక,ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలు కూడా ఇందులో భాగమయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
వివరాలు
పాకిస్థాన్లోని ఇస్లామాబాద్లో 2016లో సార్క్ సదస్సు
ఈ కొత్త కూటమి ప్రధానంగా వాణిజ్యం,అనుసంధానతపై దృష్టి పెట్టి ప్రాంతీయ సంబంధాలను బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతుందని "ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్" పేర్కొంది. ఈ బృందం ఏర్పడితే ఇప్పటికే నిద్రానంగా ఉన్న సార్క్ పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం ఉంది. గతంలో 2016లో సార్క్ సదస్సు పాకిస్థాన్లోని ఇస్లామాబాద్లో జరగాల్సి ఉండగా, అదే ఏడాది ఉరిలో భారత సైనిక శిబిరంపై ఉగ్రవాదులు దాడి జరిపారు. ఈ ఘటన నేపథ్యంలో భారత్ ఆ సదస్సుకు హాజరవడాన్ని తిరస్కరించింది. అనంతరం భూటాన్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్లు కూడా ఈ సదస్సులో పాల్గొనటానికి ఆసక్తి చూపలేదు. అప్పటినుండి సార్క్ సదస్సులు మళ్లీ జరగలేదు.