
India-US: భారత్తో భారీ వాణిజ్య ఒప్పందం.. హింట్ ఇచ్చిన ట్రంప్
ఈ వార్తాకథనం ఏంటి
భారత్తో త్వరలోనే భారీ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. వాషింగ్టన్లోని వైట్హౌస్ వేదికగా నిర్వహించిన 'బిగ్ బ్యూటిఫుల్ బిల్'అనే కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అదే సందర్భంలో,చైనా దేశంతో వాణిజ్య ఒప్పందం చేసుకున్నామని వెల్లడించారు. "ప్రపంచంలోని ప్రతి దేశం మాతో ఒప్పందాలు చేసుకోవాలని ఆశిస్తుంది. కొన్ని నెలల కిందట మీడియా నన్ను ఓ ప్రశ్న అడిగింది..నిజంగా మీతో ఒప్పందాలు చేసుకోవడానికి ఎవరైనా ఆసక్తి చూపిస్తున్నారా అని. ఇప్పుడు నేను చెబుతున్నాను..నిన్ననే చైనాతో వాణిజ్య ఒప్పందంపై సంతకం చేశాం.రాబోయే రోజుల్లో మరికొన్ని గొప్ప దేశాలతో కూడా ఒప్పందాలు కుదురుతాయి.వాటిలో భారత్తో ఒప్పందం అత్యంత పెద్దదిగా ఉండే అవకాశం ఉంది,"అని ట్రంప్ వివరించారు.
వివరాలు
పలు దేశాల దిగుమతులపై అధిక సుంకాలు
అయితే చైనాతో జరిగిన ఒప్పందానికి సంబంధించిన వివరాలు మాత్రం ఆయన వెల్లడించలేదు. ఇక, ఈసందర్భంగా తాము అన్ని దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకోవాలనుకోవడం లేదని ట్రంప్ స్పష్టం చేశారు. గత ఏప్రిల్లో ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం పలు దేశాల దిగుమతులపై అధిక సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. ఆపై కొంతకాలానికి ఆ టారిఫ్ల అమలును తాత్కాలికంగా వాయిదా వేసింది. ఈ పరిస్థితుల్లో అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని సాధించడంపై భారత్ దృష్టి సారించింది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు ఇరు దేశాధినేతల మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు ప్రారంభమయ్యాయి. పరస్పర ప్రయోజనాల దృష్ట్యా ఈ ఒప్పందాన్ని చేసుకోవాలని ఇరువురు అంగీకరించారు.
వివరాలు
సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి తొలి దశ ఒప్పందం
ఈ నేపథ్యంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్, అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్తో సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి తొలి దశ ఒప్పందాన్ని ఖరారు చేయాలన్న లక్ష్యంతో చర్చలు సాగుతున్నట్లు సమాచారం.