
Trump: పాక్ తో యుద్ధంపై స్వయంగా భారత ప్రధాని నరేంద్రమోదీకి ఫోన్': ట్రంప్ మళ్లీ అదే పాట
ఈ వార్తాకథనం ఏంటి
భారత్-పాకిస్థాన్ మధ్య జరిగే ఘర్షణలను తానే ఆపానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తరచుగా చెప్పుకుంటున్న విషయం తెలిసిందే. న్యూదిల్లీ ఎన్ని సార్లు దీనిని ఖండించినప్పటికీ, ఆయన దృక్పథం మాత్రం మారలేదు. తాజాగా ట్రంప్ మరోసారి ఈ అంశంపై స్పందిస్తూ, మళ్లీ అదే పాత కథను పునరావృతం చేశారు. ''ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)'' సమయంలో తానే ప్రత్యక్షంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేసినట్లు ఆయన తెలిపారు.
వివరాలు
భారీ టారిఫ్లతో మీ కళ్లు బైర్లు కమ్ముతాయి : ట్రంప్
అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం వైట్హౌస్లో జరిగిన క్యాబినెట్ సమావేశంలో ట్రంప్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. ''ఆ రోజు ఓ కఠినమైన వ్యక్తి, భారత ప్రధాన మంత్రి మోదీతో మాట్లాడాను.పాకిస్తాన్తో జరిగే పరిస్థితులను వివరంగా అడిగాను. ఆ తర్వాత పాక్ అధికారులతోనూ చర్చించాను. అప్పటికే రెండు దేశాల మధ్య ఘర్షణలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఇది సుదీర్ఘ ముప్పుగా కొనసాగే అవకాశం ఉందని భావించాను. అణు యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందని గ్రహించి, ఘర్షణలను ఆపాలని విజ్ఞప్తి చేసాను. లేదంటే భారత్ పాక్తో వాణిజ్య ఒప్పందాలు చేసుకోబోమని హెచ్చరించాను. నేను విధించే భారీ టారిఫ్లతో మీ వ్యాపారాలు ప్రాబల్యం కోల్పోతాయని తెలిపాను. ఐదు గంటల్లోనే పరిస్థితులు సక్రమమయ్యాయి'' అని ట్రంప్ తెలిపారు.
వివరాలు
భారత్-పాక్ మధ్య అమెరికా మధ్యవర్తిత్వం విషయంలో ఏమీ చర్చించలేదు: మోదీ
గత కొంత కాలంగా,ట్రంప్ భారత్-పాక్ ఉద్రిక్తతలను తానే నియంత్రించానని తరచుగా పేర్కొంటూనే ఉన్నారు. అయితే, భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు దీనిని తిరస్కరిస్తూ వచ్చింది. ఇటీవల జీ7 సదస్సు కోసం కెనడా వెళ్లిన ప్రధాని మోదీ కూడా దీనిపై స్పష్టంగా వ్యాఖ్యానించారు. ''భారత్-పాక్ మధ్య ఏర్పడే ఒప్పందాల్లో అమెరికా ప్రమేయం లేదు. పహల్గాం,ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్-అమెరికా మధ్య ఏ స్థాయిలోనూ వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరగలేదు. అలాగే, భారత్-పాక్ మధ్య అమెరికా మధ్యవర్తిత్వం విషయంలో ఏమీ చర్చించలేదు. కాల్పుల విరమణకు సంబంధించిన మిలిటరీ స్థాయి చర్చలు మాత్రమే జరిగాయి. పాక్ అభ్యర్థన మేరకు 'ఆపరేషన్ సిందూర్'ను నిలిపివేశాం.ఇకపై భారత్ ఎప్పటికీ ఇతర దేశాల మధ్యవర్తిత్వాన్ని అంగీకరించదు'' అని నరేంద్ర మోదీ స్పష్టంగా చెప్పారు.