
Salman Khurshid: జమ్మూకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు.. ప్రశంసించిన కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్
ఈ వార్తాకథనం ఏంటి
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశిథరూర్ లానే అదే పార్టీకి చెందిన మరో ప్రముఖ నేత సల్మాన్ ఖుర్షీద్ కూడా కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అభినందించారు.
జమ్ముకశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ను రద్దు చేసిన అంశంపై ఆయన ప్రశంసలు కురిపించారు.
ఇటీవల 'ఆపరేషన్ సిందూర్'పై ఏర్పాటైన అఖిలపక్ష ప్రతినిధి బృందంతో కలిసి ఇండోనేషియా పర్యటనలో ఉన్న సమయంలో ఖుర్షీద్ ఈ వ్యాఖ్యలు చేశారు.
వివరాలు
65 శాతం మంది ఓటర్లు
"కశ్మీర్ అనేది ఎన్నో సంవత్సరాలుగా ఒక పెద్ద సమస్యగా మారింది. ప్రత్యేక హోదా కారణంగా అది దేశంలోని ఇతర ప్రాంతాలనుండి వేరుపడ్డ ప్రాంతంగా భావించబడేది. కానీ ఆర్టికల్ 370ను రద్దు చేయడం ద్వారా ఆ వేరుబాటును తుడిచిపెట్టారు. దీని వల్ల అక్కడి ప్రజల్లో ఒక్కటైపోయే భావన కలిగింది," అని ఖుర్షీద్ తెలిపారు.
ఆయన అభిప్రాయం ప్రకారం, ఈ నిర్ణయం స్థానికంగా సానుకూల మార్పుల దిశగా నడిపించి, అభివృద్ధికి దోహదపడింది.
తాజాగా అక్కడ ఎన్నికలు జరగగా, దాదాపు 65 శాతం మంది ఓటర్లు పాల్గొన్నారని, ప్రస్తుతం రాష్ట్రానికి ఎన్నికైన ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన వివరించారు.
వివరాలు
మోదీ నేతృత్వంలోని ప్రభుత్వ విధానాలపై ప్రశంసలు
పాక్ ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదంపై అంతర్జాతీయంగా దృష్టి ఆకర్షించేందుకు భారత పార్లమెంటు అఖిలపక్ష బృందాలు పలు దేశాలలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత శశిథరూర్ మాదిరిగానే కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న చర్యలను సమర్థిస్తూ ఖుర్షీద్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో సంచలనం రేపుతున్నాయి.
ప్రస్తుతం ఇండోనేసియా, మలేసియా, దక్షిణ కొరియా, జపాన్, సింగపూర్ వంటి దేశాల్లో పర్యటిస్తున్న బృందంలో ఖుర్షీద్ కూడా సభ్యుడిగా ఉన్నారు.
ఆయన కూడా మోదీ నేతృత్వంలోని ప్రభుత్వ విధానాలను ప్రశంసించడం గమనార్హం.
2019లో ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఆర్టికల్ 370ను అధికారికంగా రద్దు చేసిన విషయం తెలిసిందే.