
PM Modi: 'ఒత్తిడి పెరగోచ్చు,అన్నింటినీ భరిస్తాం': అమెరికా సుంకాలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా భారత్పై విధించిన అదనపు సుంకాల అమలు గడువు దగ్గరపడుతున్న తరుణంలో, ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. రైతులు, పశుపోషకులు, చిన్నస్థాయి పరిశ్రమల ప్రయోజనాల విషయంలో రాజీ పడే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో భారత్పై ఒత్తిడి పెరిగినా దాన్ని తట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. గుజరాత్ పర్యటనలో భాగంగా అహ్మదాబాద్లో నిర్వహించిన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
వివరాలు
దేశ సైనిక శౌర్యపరాక్రమాలను 'ఆపరేషన్ సిందూర్' చాటిచెప్పింది: మోదీ
''పలువురు దశాబ్దాలపాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ, దిగుమతుల విషయంలో అవకతవకలకు పాల్పడింది. దాంతో భారత్ ఇతర దేశాలపై ఆధారపడే పరిస్థితి ఏర్పడింది. అయితే శక్తి, రక్షణకు ప్రతీక అయిన సుదర్శన చక్రధారి మోహన్ (శ్రీకృష్ణుడు), స్వదేశీ ఉద్యమాన్ని తన రాట్నం ద్వారా ముందుకు నడిపించిన చరఖా ధారి మోహన్ (మహాత్మా గాంధీ) మార్గంలో నడిచి దేశం సాధికారత సాధించింద'' అని మోదీ పేర్కొన్నారు. అలాగే, భారత సైన్యం వీరత్వాన్ని 'ఆపరేషన్ సిందూర్' స్పష్టంగా ప్రతిబింబించిందని గుర్తు చేశారు.
వివరాలు
గడువును ట్రంప్ పొడిగించే అవకాశం లేదు: పీటర్ నవారో
ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత దిగుమతులపై మొదట 25 శాతం సుంకాలు విధించగా, తరువాత మరో 25 శాతం అదనంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కొత్త సుంకాలు ఈనెల 27 నుంచి అమలులోకి రానున్నాయి. ఈ గడువును ట్రంప్ పొడిగించే అవకాశం లేదని, కొన్ని రోజుల క్రితం వైట్హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో తెలిపారు. అదనపు సుంకాలు అన్యాయం, అనుచితం అని భారత్ ఇప్పటికే నిరసన వ్యక్తం చేసింది. అంతేకాదు, దేశ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్రం స్పష్టంచేసింది.