
Shubhanshu: భూమికి రాక అనంతరం శుభాంశు శుక్లాకు ఏడురోజుల క్వారంటైన్
ఈ వార్తాకథనం ఏంటి
యాక్సియం-4 మిషన్ లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంకు వెళ్లిన భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా, ఇతర ముగ్గురు వ్యోమగాములు జులై 14న భూమికి తిరిగిరానున్నారు. ల్యాండింగ్ తర్వాత వారిని కాలిఫోర్నియా తీరంలో స్వాగతించి,వెంటనే ఏడురోజుల పాటు క్వారంటైన్కు తరలించనున్నట్లు అధికారులు తెలిపారు. అంతరిక్షంలో గరుత్వాకర్షణ లేని పరిస్థితులను అనుభవించిన కారణంగా భూమి వాతావరణానికి శరీరాలు మళ్లీ అలవాటుపడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. శుభాంశుతో పాటు పెగ్గీ విట్సన్, స్లావోస్జ్ ఉజ్నాన్స్కీ-విస్నియొస్కీ, టిబర్ కపు కూడా ఈ మిషన్లో పాల్గొన్నారు.వారు తిరిగి వచ్చే ముందు పలు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. క్వారంటైన్లో ఉన్న వారంరోజుల్లో ఇస్రోకు చెందిన వైద్య బృందం వారి ఆరోగ్య స్థితిని నిశితంగా పర్యవేక్షించనుంది.
Details
28 గంటల ప్రయాణం తర్వాత వారు ఐఎస్ఎస్లోకి ప్రవేశం
ఈ సమయంలో శరీరంపై వ్యోమయానం చేసిన ప్రభావాన్ని అధ్యయనం చేస్తారు. ముఖ్యంగా రక్తప్రసరణ, హృదయకంఠాలు, మెదడు పనితీరు వంటి అంశాలపై అంతరిక్ష ప్రయాణం ఎలా ప్రభావం చూపిందన్నది పరిశీలిస్తారు. యాక్సియం-4మిషన్ ద్వారా ఈ వ్యోమగాములు జూన్ 25న ఫ్లోరిడాలోని కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచి నింగిలోకి వెళ్లారు. దాదాపు 28 గంటల ప్రయాణం తర్వాత వారు ఐఎస్ఎస్లోకి ప్రవేశించారు. రెండు వారాలుగా శుభాంశు ఐఎస్ఎస్లో నిర్వహించిన అనేక ప్రయోగాల్లో భాగంగా మొత్తం 96.5 లక్షల కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించారు. ఇప్పటివరకు భూమి చుట్టూ దాదాపు 230 ప్రదక్షిణలు పూర్తి చేశారని యాక్సియం స్పేస్ తెలిపింది. ఈయాత్రతో భారత అంతరిక్ష చరిత్రలో మరో కీలక అధ్యాయానికి శుభాంశు శుక్లా నాంది పలికినట్టు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.