LOADING...
Radhakrishnan: ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ ఎవరు?ఇంతకీ ఎవరీయన..
ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ ఎవరు?ఇంతకీ ఎవరీయన..

Radhakrishnan: ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ ఎవరు?ఇంతకీ ఎవరీయన..

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 18, 2025
09:53 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పేరును ఎన్డీఏ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటివరకు చర్చల్లో లేకుండా ఉన్న ఈ పేరు ఒక్కసారిగా బయటకు రావడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి కలిగించింది. అయితే ఆయన ఎంపిక వెనుక బీజేపీకి ఉన్న వ్యూహమే ప్రధాన కారణమని భావిస్తున్నారు. తమిళనాడులోని తిరుప్పూర్‌కు చెందిన రాధాకృష్ణన్‌కి అక్కడి బీజేపీ నేతలతో మంచి అనుబంధం ఉంది. ఆయన ఇప్పటివరకు జార్ఖండ్, తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్‌గా పనిచేసిన అనుభవం కలిగి ఉన్నారు. అదేవిధంగా ఆర్‌ఎస్‌ఎస్‌తో కూడా ఆయనకు గాఢమైన సంబంధాలు ఉన్నాయి. ఇక వచ్చే ఏడాది ఆరంభంలోనే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

వివరాలు 

ఆగస్టు 21న రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు

ఈసారి ఆ రాష్ట్రంలో పార్టీ బలపడాలని బీజేపీ సంకల్పించింది. అందుకే దక్షిణ భారతానికి చెందిన ఒక నాయకుడిని ఉపరాష్ట్రపతి పదవికి ఎంపిక చేస్తే, ఎన్నికల్లో లాభం కలుగుతుందని ఆలోచన చేసిందని తెలుస్తోంది. ఈ వ్యూహంలో భాగంగా రాధాకృష్ణన్ పేరు ముందుకు తెచ్చారని సమాచారం. ఆయన పార్టీకి ఎప్పుడూ అంకితభావంతో పనిచేసిన చరిత్ర కూడా ఈ ఎంపికకు తోడైందని విశ్లేషకులు చెబుతున్నారు. ఆగస్టు 21న రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు, ఎన్డీఏ అనుబంధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలు సెప్టెంబర్ 9న జరగనున్నాయి. సీపీ రాధాకృష్ణన్ పూర్తి పేరు చంద్రపురం పొన్నుసామి రాధాకృష్ణన్.

వివరాలు 

2024 జూలై 31న ఆయన మహారాష్ట్ర గవర్నర్‌గా ప్రమాణం

ఇటీవలే, 2024 జూలై 31న ఆయన మహారాష్ట్ర గవర్నర్‌గా ప్రమాణం చేశారు. అంతకుముందు 2023 ఫిబ్రవరి 18న జార్ఖండ్ గవర్నర్‌గా నియమితులై, దాదాపు ఒకటిన్నర సంవత్సరం పాటు ఆ పదవిలో కొనసాగారు. జార్ఖండ్ బాధ్యతలు నిర్వహిస్తూ, తాత్కాలికంగా తెలంగాణ గవర్నర్‌గా, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా కూడా సేవలందించారు. 1957 అక్టోబర్ 20న తిరుప్పూర్‌లో జన్మించిన ఆయన బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేశారు. చిన్ననాటి నుంచే ఆర్‌ఎస్‌ఎస్ స్వయంసేవకుడిగా చురుకుగా పాల్గొన్నారు. 1974లో భారతీయ జనసంఘ్ రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యుడిగా పనిచేశారు. తరువాత 1996లో తమిళనాడు బీజేపీ కార్యదర్శిగా నియమితులయ్యారు. రెండు సంవత్సరాల తర్వాత, 1998లో తొలిసారి కోయంబత్తూరు నియోజకవర్గం నుంచి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.

వివరాలు 

తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా..

1999లో మరోసారి అదే స్థానం సాధించారు. ఎంపీగా ఉన్న సమయంలో టెక్స్‌టైల్స్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా, పీఎస్‌యు పార్లమెంటరీ కమిటీ, ఆర్థిక సలహా కమిటీ, అలాగే స్టాక్ ఎక్స్ఛేంజ్ కుంభకోణంపై దర్యాప్తు చేసిన ప్రత్యేక పార్లమెంటరీ కమిటీలలో సభ్యుడిగా వ్యవహరించారు. 2004 నుండి 2007 వరకు ఆయన తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఈ పదవిలో ఉన్నప్పుడు 93 రోజులు పాటు 19,000 కిలోమీటర్ల రథయాత్ర నిర్వహించారు. ఆ యాత్రలో అన్ని నదులను అనుసంధానం చేయాలి, ఉగ్రవాదాన్ని నిర్మూలించాలి, ఏకరీతి పౌర నియమావళి తీసుకురావాలి, అంటరానితనాన్ని తుడిచిపెట్టాలి, మాదకద్రవ్యాల ముప్పును అరికట్టాలి వంటి డిమాండ్లను ప్రజలకు తెలియజేశారు.

వివరాలు 

టేబుల్ టెన్నిస్‌లో కళాశాల స్థాయిలో ఛాంపియన్‌

2016లో ఆయన కొచ్చిలోని కాయిర్ బోర్డు ఛైర్మన్‌గా నియమితులై నాలుగేళ్లపాటు ఆ బాధ్యతలు నిర్వర్తించారు. తరువాత 2020 నుంచి 2022 వరకు కేరళలో బీజేపీకి అఖిల భారత ఇన్‌చార్జ్‌గా పనిచేశారు. ఆయనకు క్రీడలంటే కూడా ఆసక్తి. టేబుల్ టెన్నిస్‌లో కళాశాల స్థాయిలో ఛాంపియన్‌గా నిలిచారు. అదేవిధంగా క్రికెట్, వాలీబాల్ అంటే కూడా ఇష్టం.