
Team India : టెస్టు సిరీస్ను 2-2తో సమం చేసిన టీమిండియా.. భారత క్రికెట్కు ముందున్న బిజీ షెడ్యూల్
ఈ వార్తాకథనం ఏంటి
ఇంగ్లండ్ తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్ 2-2తో సమంగా ముగిసింది. ఓవల్ వేదికగా నిర్వహించిన చివరి టెస్టు పోరు ప్రేక్షకులకు నిజమైన మజాను అందజేసింది. చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్లో భారత జట్టు 6 పరుగుల తేడాతో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్లో భారత ఆటగాళ్లు చూపిన అద్భుత ప్రదర్శన అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తించింది. ఇంగ్లాండ్తో సిరీస్ ముగిసిన వెంటనే క్రికెట్ అభిమానుల దృష్టంతా భారత జట్టు తదుపరి సిరీస్పై నిలిచింది. తాజాగా షెడ్యూల్ ప్రకారం, టీమిండియా సెప్టెంబర్ 10న మరో మ్యాచ్లో బరిలోకి దిగనుంది.
వివరాలు
టీ20 ఫార్మాట్లో ఆసియా కప్
దీంతో భారత క్రికెటర్లకు నెల రోజులకు పైగా విశ్రాంతి లభించనుంది. నిజానికి ఆగస్టులో బంగ్లాదేశ్ పర్యటన వాయిదా పడటంతో ఆటగాళ్లకు ఈ విరామం లభించింది. సెప్టెంబర్లో జరిగే ఆసియా కప్లో భారత్ పాల్గొనబోతోంది. వచ్చే ఏడాది జరగబోయే టీ20 ప్రపంచ కప్ నేపథ్యంలో, ఈ ఏడాది ఆసియా కప్ను టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా జరుగనున్న ఈ టోర్నీలో టీమిండియా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు లేకుండానే బరిలోకి దిగనుంది. వీరిద్దరూ ఇప్పటికే టీ20లు, టెస్టులకు గుడ్బై చెప్పిన సంగతి తెలిసిందే. ఆసియా కప్లో భారత్ సెప్టెంబర్ 14న దుబాయ్ వేదికగా పాకిస్థాన్తో తలపడనుంది.
వివరాలు
ఆసియా కప్లో గ్రూప్ స్టేజీలో భారత షెడ్యూల్ ఇదే..
* సెప్టెంబర్ 10న యూఏఈతో * సెప్టెంబర్ 14న పాకిస్థాన్తో *సెప్టెంబర్ 19న ఒమన్తో ఆడనుంది. ఆ తరువాత సూపర్-4 మ్యాచ్లు ఉంటాయి. ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 28న జరగనుంది.
వివరాలు
ఆస్ట్రేలియా పర్యటన
ఆసియా కప్ తర్వాత భారత్ స్వదేశంలో వెస్టిండీస్తో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ అక్టోబర్ 2 నుంచి 14 వరకు జరగనుంది. తొలి టెస్టు అక్టోబర్ 2 నుండి 6 వరకు అహ్మదాబాద్లో, రెండవ టెస్టు అక్టోబర్ 10 నుండి 14 వరకు ఢిల్లీలో నిర్వహించనున్నారు. వెస్టిండీస్తో సిరీస్ ముగిసిన వెంటనే భారత జట్టు ఆసీస్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. అక్టోబర్ 19 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఆసీస్తో వన్డే సిరీస్ నుంచే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టనున్నారు.