Page Loader
IND vs BAN: బంగ్లా చిత్తు.. ఛాంపియన్ ట్రోఫీలో టీమిండియా బోణీ 
బంగ్లా చిత్తు.. ఛాంపియన్ ట్రోఫీలో టీమిండియా బోణీ

IND vs BAN: బంగ్లా చిత్తు.. ఛాంపియన్ ట్రోఫీలో టీమిండియా బోణీ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 20, 2025
09:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు విజయంతో బోణీ కొట్టింది. దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌటైంది. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్ 46.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 231 పరుగులు చేసి విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (101*) శతకంతో అదరగొట్టాడు. ఇది గిల్ కెరీర్‌లో 8వ శతకం కాగా, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో అతనికి ఇదే తొలి శతకం కావడం విశేషం.

Details

దూకుడుగా ఆడిన రోహిత్ శర్మ

ఇంగ్లండ్‌పై సెంచరీ చేసి ఫామ్‌లో ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ (41) బంగ్లాదేశ్‌తోనూ అదే దూకుడు కొనసాగించాడు. ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి తొలి వికెట్‌కు 10 ఓవర్లలో 69 పరుగులు జోడించాడు. అయితే రోహిత్ ఔటైన అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ (22) కాస్త నెమ్మదిగా ఆడి, స్పిన్నర్ రిషద్ బౌలింగ్‌లో వికెట్ కోల్పోయాడు. శ్రేయస్ అయ్యర్ (15) కొన్ని మెరుగైన షాట్లు ఆడినా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేదు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో ఐదో స్థానంలో రాణించిన అక్షర్ పటేల్ (8) ఈసారి విఫలమయ్యాడు.

Details

గిల్ మెరుపు బ్యాటింగ్

మరోవైపు వికెట్లు పడుతున్నా శుభ్‌మన్ గిల్ తన ఏకాగ్రతను కోల్పోకుండా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో కేఎల్ రాహుల్ (40*) తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. కేఎల్ రాహుల్ బ్యాటింగ్ సమయంలో అదృష్టం కూడా కలిసొచ్చింది. ఒక సందర్భంలో బంగ్లా ఫీల్డర్ అతని క్యాచ్‌ను వదిలేయడంతో భారత్‌పై ఒత్తిడి తగ్గింది. గిల్-కేఎల్ జోడీ ఐదో వికెట్‌కు 85 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పి జట్టును విజయపథంలో నడిపించింది.

Details

జకేర్ క్యాచ్ మిస్ చేసిన రోహిత్ శర్మ 

బంగ్లాదేశ్ 35/5తో కష్టాల్లో ఉన్నప్పుడే అక్షర్ పటేల్ బౌలింగ్‌లో జకేర్ అలీ (68) ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్‌లో రోహిత్ శర్మ డ్రాప్ చేశాడు. దీనివల్ల అక్షర్ పటేల్ హ్యాట్రిక్ మిస్ అయ్యింది. ఆ తర్వాత జకేర్ అలీ తౌహిద్ హృదోయ్ (100) తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 154 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. జకేర్ ఔటైనప్పటికీ, తౌహిద్ సెంచరీ సాధించి చివరి వికెట్‌గా పెవిలియన్ చేరాడు.

Details

షమీ మరోసారి మ్యాజిక్ 

భారత సీనియర్ పేసర్ మహ్మద్ షమీ (5/53) ఐదు వికెట్లతో చెలరేగి ఐసీసీ టోర్నీలో మరోసారి తన స్థాయిని చాటాడు. షమీ అద్భుత ప్రదర్శనతో పాటు హర్షిత్ 3, అక్షర్ పటేల్ 2 వికెట్లు తీశారు. అయితే, జకేర్ ఇచ్చిన క్యాచ్‌ను రోహిత్ అందుకుని ఉంటే బంగ్లాదేశ్ తక్కువ స్కోర్‌కే పరిమితమయ్యేది. అలా జరిగి ఉంటే భారత్‌కు గెలుపు మరింత సులభమయ్యేది.