
National Turmeric Board: నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు.. 29న అమిత్షా చేతుల మీదుగా ప్రారంభం.. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి వెల్లడి
ఈ వార్తాకథనం ఏంటి
పసుపు సాగు చేస్తున్న రైతుల జీవితాల్లో వెలుగులు నింపే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేయబోతున్నట్లు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. ఈ నెల 29వ తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేతుల మీదుగా ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో జరగనున్న రైతు సభ ఏర్పాట్లను గురువారం కిషన్రెడ్డి పరిశీలించారు. స్థానిక పాలిటెక్నిక్ కళాశాలలో ఈ సమావేశం నిర్వహించనుండగా, ఎంపీ ధర్మపురి అర్వింద్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఇతర అధికారులతో కలిసి ఆయన ఏర్పాట్లను సమీక్షించారు.
వివరాలు
పసుపు బోర్డు చైర్మన్గా రైతుబిడ్డ పల్లె గంగారెడ్డి
ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడిన కిషన్రెడ్డి మాట్లాడుతూ.. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు పసుపు బోర్డును తమ రాష్ట్రాల్లో ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని అభ్యర్థించాయి. అయితే, ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా నిజామాబాద్ను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఇది నిజామాబాద్ రైతులకు కేంద్రం నుంచి వచ్చిన గొప్ప బహుమతిగా ఆయన అభివర్ణించారు. పసుపు బోర్డు చైర్మన్గా జిల్లాకు చెందిన రైతుబిడ్డ పల్లె గంగారెడ్డిని నియమించినట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా పసుపు ఉత్పత్తిని పెంచేందుకు, భారతదేశానికి అంతర్జాతీయ స్థాయిలో గౌరవం తీసుకురావడం లక్ష్యంగా కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయెల్తో కలిసి కార్యాచరణను రూపొందిస్తామని ఆయన స్పష్టం చేశారు.
వివరాలు
ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకే అప్పగించాలి: కిషన్రెడ్డి
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకు అప్పగించాలన్నదే భారతీయ జనతా పార్టీ (బీజేపీ) స్థిరమైన డిమాండ్ అని కిషన్రెడ్డి పేర్కొన్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్నవారు పోలీసు వ్యవస్థకు చెందారని, అదే వ్యవస్థ ఈ దర్యాప్తును చేపడితే నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో కాంగ్రెస్కి చెందిన కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్లమెంట్ సభ్యులు సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. గత ఏడాది ఇదే అంశంపై హైకోర్టులో పిటిషన్ వేసిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు.
వివరాలు
ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకే అప్పగించాలి: కిషన్రెడ్డి
భారతీయ రాష్ట్ర సమితి (భారాస)తో కుమ్మక్కు కాలేదని నిరూపించాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో వ్యవహరించాలని సూచించారు. నిజాయితీ ఉంటే సీబీఐకే ఈ కేసును అప్పగించాలని ఆయన స్పష్టం చేశారు. తన ఆరోపణలను బలపరిచేలా, ఫోన్ ట్యాపింగ్కు బలైనవారిలో సినీనటులు, రాజకీయ నాయకులు, మీడియా అధినేతలు కూడా ఉన్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.