MK Stalin: డీలిమిటేషన్ పై కేంద్రప్రభుత్వంతో స్టాలిన్ పోరాటం.. ఏడు రాష్ట్రాల సీఎంలకు లేఖ
ఈ వార్తాకథనం ఏంటి
లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) అంశంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ (MK Stalin) కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ అంశంపై తాజాగా ఏడు రాష్ట్రాలకు లేఖ రాస్తూ, డీలిమిటేషన్ ప్రతిపాదనకు వ్యతిరేకంగా 'జాయింట్ యాక్షన్ కమిటీ' ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు.
ఇటీవల తమిళనాడులో స్టాలిన్ నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో తీసుకున్న తీర్మానాన్ని ఆధారంగా చేసుకుని ఈ లేఖలను పంపారు.
కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, ఒడిశా సీఎంలకు ఈ లేఖలు పంపారు.
వివరాలు
సమావేశానికి ఆహ్వానం
సమష్టి కార్యాచరణ కోసం మార్చి 22న చెన్నైలో నిర్వహించే సమావేశానికి హాజరుకావాలని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులను, ముఖ్యమైన రాజకీయ నాయకులను, అధికార, ప్రతిపక్ష నేతలను ఆహ్వానించారు.
స్టాలిన్ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, "డీలిమిటేషన్ అనేది సమాఖ్య వ్యవస్థపై చేస్తున్న దాడి. ఇది పార్లమెంటులో మన ప్రాతినిధ్యానికి నష్టం కలిగించి, జనాభాను నియంత్రించిన రాష్ట్రాలను శిక్షించే విధంగా మారుతుంది. ఈ అన్యాయాన్ని మేము సహించబోము" అని ఎక్స్ (Twitter) వేదికగా ప్రకటించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఎం.కె. స్టాలిన్ చేసిన ట్వీట్
The Union Govt's plan for #Delimitation is a blatant assault on federalism, punishing States that ensured population control & good governance by stripping away our rightful voice in Parliament. We will not allow this democratic injustice!
— M.K.Stalin (@mkstalin) March 7, 2025
I have written to Hon'ble Chief… pic.twitter.com/1PQ1c5sU2V
వివరాలు
డీలిమిటేషన్ వివాదం ఏమిటి?
2026లో లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది. కానీ, దీనికి అనుసరించబోయే విధానాల వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్రమైన నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
దక్షిణ భారత రాష్ట్రాల్లో జనాభా తక్కువగా ఉండటం వల్ల పార్లమెంటులో వాటి ప్రాతినిధ్యం తగ్గిపోతుందన్న భయాలు ఉన్నాయి.
కుటుంబ నియంత్రణలో ఈ రాష్ట్రాలు సాధించిన విజయమే ఇప్పుడు పాలిట శాపమవుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
వివరాలు
ఉత్తర రాష్ట్రాలకు ప్రయోజనం, దక్షిణాదికి నష్టం?
జనాభా నియంత్రణపై తక్కువ దృష్టి పెట్టిన ఉత్తర భారత రాష్ట్రాలు, ముఖ్యంగా ఉత్తర్ప్రదేశ్, బిహార్, లోక్సభలో తమ ప్రాతినిధ్యాన్ని పెంచుకునే అవకాశం కలిగించుకోనున్నాయి.
ఫలితంగా, పరిపాలన, అభివృద్ధి, జనాభా నియంత్రణలో ముందున్న దక్షిణాది రాష్ట్రాలు రాజకీయంగా దెబ్బతినే అవకాశముంది.
లోక్సభ సీట్ల సంఖ్య తగ్గిపోవడంతో, కేంద్ర నిధుల కోసం తమ డిమాండింగ్ పవర్ తగ్గిపోతుందన్న భయాలు కూడా ఉన్నాయి.
వివరాలు
దక్షిణ-ఉత్తర రాష్ట్రాల మధ్య విభేదాల ముద్ర?
ఈ చర్యల వలన ఉత్తర-దక్షిణ రాష్ట్రాల మధ్య విభేదాలు పెరిగే అవకాశముందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
తమ హక్కులను కాలరాస్తున్నారన్న భావన దక్షిణ భారత రాష్ట్రాల్లో వ్యాప్తిచెందుతోంది.
డీఎంకే పోరాటం.. కేంద్రానికి డిమాండ్
జనాభా ఆధారంగా లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనను తమిళనాడు పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
ముఖ్యంగా, స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ఈ అంశంలో కేంద్రంపై పోరాటం సాగిస్తోంది.
పార్లమెంట్లో ప్రాతినిధ్యం తగ్గకుండా ఉండేలా 1971 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుని రాష్ట్రాల మధ్య ప్రస్తుత నిష్పత్తిని కొనసాగించేలా రాజ్యాంగ సవరణలు చేపట్టాలని డీఎంకే కేంద్రాన్ని డిమాండ్ చేసింది.