Page Loader
India-US Relations: అమెరికాకు భారత్ ఒక వ్యూహాత్మక మిత్రదేశం.. త్వరలో వాణిజ్య ఒప్పందం: వైట్ హౌస్
అమెరికాకు భారత్ ఒక వ్యూహాత్మక మిత్రదేశం.. త్వరలో వాణిజ్య ఒప్పందం: వైట్ హౌస్

India-US Relations: అమెరికాకు భారత్ ఒక వ్యూహాత్మక మిత్రదేశం.. త్వరలో వాణిజ్య ఒప్పందం: వైట్ హౌస్

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 01, 2025
07:51 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశంతో ఉన్న సంబంధం ఎంతో ప్రత్యేకమైందని అమెరికా మళ్లీ వెల్లడించింది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్ ఒక అత్యంత కీలక వ్యూహాత్మక భాగస్వామ్య దేశమని పేర్కొంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్,భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య దృఢమైన స్నేహబంధం ఉన్నట్లు వైట్ హౌస్ వెల్లడించింది. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందానికి సంబంధించి చర్చలు చివరి దశకు చేరుకున్నాయని, ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుతున్నట్లు వివరించింది.

వివరాలు 

ట్రంప్-మోదీ మధ్య బలమైన అనుబంధం ఉందని లెవిట్ వ్యాఖ్య 

వాషింగ్టన్‌లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో, వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రభావంపై వార్తా సంస్థ ఏఎన్ఐ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ, "ఆ ప్రాంతంలో భారత్‌ మాకు అత్యంత ముఖ్యమైన వ్యూహాత్మక మిత్రదేశం. అధ్యక్షుడు ట్రంప్‌కు, ప్రధాని మోదీకి మధ్య బలమైన సంబంధం ఉంది. ఇది భవిష్యత్తులోనూ కొనసాగుతుంది" అని తెలిపారు.

వివరాలు 

భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం తుదిదశలో ఉంది 

ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందంపై అడిగిన మరో ప్రశ్నకు కూడా కరోలిన్ లెవిట్ సానుకూల స్పందన ఇచ్చారు. "గత వారం అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్న విధంగా, వాణిజ్య ఒప్పందానికి సంబంధించి చర్చలు చివరి దశకు చేరుకున్నాయి. ఇదే విషయంపై నేను మా వాణిజ్య కార్యదర్శితో ఇటీవల మాట్లాడాను. ప్రస్తుతం వారు ఒప్పందాల ఖరారుపై పనిచేస్తున్నారు. త్వరలోనే అధ్యక్షుడు ట్రంప్ లేదా ఆయన వాణిజ్య బృందం దీనిపై అధికారిక ప్రకటన చేస్తారు" అని వివరించారు.

వివరాలు 

అమెరికాలో విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన 

ప్రస్తుతం భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆయన క్వాడ్ (Quadrilateral Security Dialogue - QUAD) దేశాల విదేశాంగ మంత్రుల సమావేశానికి హాజరవుతున్నారని సమాచారం. ఈ పర్యటనలో భాగంగా, సోమవారం న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో "ఉగ్రవాదం ద్వారా కలిగే మానవ విషాదం" అనే అంశంపై ఏర్పాటు చేసిన ప్రదర్శనను ప్రారంభించారు. కొన్ని దేశాల మద్దతుతో ఉగ్రవాదం ఎలా విస్తరిస్తోందో ప్రపంచం దృష్టికి తీసుకురావడమే ఈ ప్రదర్శన ప్రధాన లక్ష్యమని తెలిపింది.

వివరాలు 

క్వాడ్ శిఖరాగ్ర సమావేశానికి హాజరు కానున్న ట్రంప్ 

భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాల కూటమే క్వాడ్. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుతమైన, స్థిరమైన వాతావరణాన్ని కొనసాగించడమే దీని లక్ష్యం. ఈ ఏడాది చివర్లో న్యూఢిల్లీలో జరగనున్న క్వాడ్ శిఖరాగ్ర సమావేశానికి హాజరవేందుకు ప్రధాని మోదీ పంపిన ఆహ్వానాన్ని అధ్యక్షుడు ట్రంప్ అంగీకరించారు. ఇటీవల కెనడాలో నిర్వహించిన జీ7 సమావేశ సందర్భంగా మోదీ, ట్రంప్‌లు ఫోన్‌లో మాట్లాడిన సమయంలో ఈ అంశం తేలిందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ అప్పట్లో వెల్లడించారు.