LOADING...
AICC: ఏఐసీసీ కీలక నిర్ణయం.. అభ్యర్థుల ఎంపిక బాధ్యత డీసీసీలకు అప్పగిస్తూ తీర్మానం
ఏఐసీసీ కీలక నిర్ణయం.. అభ్యర్థుల ఎంపిక బాధ్యత డీసీసీలకు అప్పగిస్తూ తీర్మానం

AICC: ఏఐసీసీ కీలక నిర్ణయం.. అభ్యర్థుల ఎంపిక బాధ్యత డీసీసీలకు అప్పగిస్తూ తీర్మానం

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 09, 2025
12:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో నిర్వహించిన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) సమావేశాల్లో పార్టీ భవిష్యత్ కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా జిల్లా స్థాయి డీసీసీ అధ్యక్షులకు మరిన్ని అధికారాలు అప్పగిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా ఒక తీర్మానం చేసింది. రానున్న ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక బాధ్యతను డీసీసీ అధ్యక్షులకు బదలాయించడం ఈ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాల్లో ఒకటి. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధికారికంగా ప్రకటించారు.

వివరాలు 

 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమం విఫలం 

ఈ సందర్భంగా ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్రమైన విమర్శలు చేశారు. మోదీ ప్రభుత్వంపై ధ్వజమెత్తుతూ, ఆయనను కేవలం ప్రచార మోహంతో పరిమితమయ్యే నేతగా అభివర్ణించారు. మోదీ చేపట్టిన 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమం ఘోర వైఫల్యంగా నిలిచిందని చెప్పారు. రాజకీయ పార్టీలు తమ భావజాలాన్ని దేశ ప్రయోజనాలకంటే ముందుగా ఉంచితే, స్వాతంత్ర్యానికి విలువ తగ్గిపోతుందని హెచ్చరించారు. ఈ విషయంలో డా. బీఆర్ అంబేద్కర్ అప్పుడే ప్రజలను అప్రమత్తం చేశారని గుర్తు చేశారు.

వివరాలు 

ప్రజల శ్రేయస్సు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక చట్టాలు  అమలు

తమిళనాడు గవర్నర్ తీరుపై సుప్రీంకోర్టు తీర్పు గవర్నర్ల వ్యవహారశైలిపై ఒక పెద్ద చెంపపెట్టు అని ఖర్గే వ్యాఖ్యానించారు. సంవత్సరాల తరబడి గవర్నర్లు బిల్లులను పెండింగ్‌లో పెట్టడం ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తుందని చెప్పారు. ప్రజల శ్రేయస్సు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో అనేక చట్టాలను అమలు చేసిందని గుర్తు చేశారు. భూసేకరణ చట్టం, తప్పనిసరి విద్యా చట్టం, అటవీ హక్కుల చట్టం లాంటి నిబంధనలు కాంగ్రెస్ హయాంలోనే ప్రవేశపెట్టబడ్డాయని వివరించారు. బీజేపీ నేతలు వెనుకబడిన వర్గాల గురించి మాట్లాడుతున్నప్పటికీ, కుల గణనపై మాత్రం పెదవి విప్పడం లేదని ఖర్గే ధ్వజమెత్తారు. వాస్తవంగా ఆ వర్గాల అభివృద్ధికి కుల గణన అనివార్యమని ఆయన అభిప్రాయపడ్డారు.

వివరాలు 

రాహుల్ నాయకత్వంలో సామాజిక సమస్యలకు తగిన పరిష్కారాలు

పేదలు, అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న నాయకుడు రాహుల్ గాంధీ అని ఖర్గే ప్రశంసించారు. సోనియా గాంధీ ఆశీర్వాదంతో రాహుల్ నాయకత్వంలో సామాజిక సమస్యలకు తగిన పరిష్కారాలు లభిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. దేశంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను నియంత్రించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో తెలంగాణకు చెందిన మాజీ కాంగ్రెస్ నేతలను స్మరించుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులుగా సేవలందించిన డీ. శ్రీనివాస్, నర్సారెడ్డి, అలాగే ఏఐసీసీ సభ్యులుగా పనిచేసిన ఇంద్రసేనారెడ్డి, టి. నాగయ్యలకు శ్రద్ధాంజలులు అర్పించారు.