Page Loader
Union Cabinet: తిరుపతి సహా దేశంలోని ఐదు ఐఐటీల్లో రూ.11,828 కోట్లతో విస్తరణ
తిరుపతి సహా దేశంలోని ఐదు ఐఐటీల్లో రూ.11,828 కోట్లతో విస్తరణ

Union Cabinet: తిరుపతి సహా దేశంలోని ఐదు ఐఐటీల్లో రూ.11,828 కోట్లతో విస్తరణ

వ్రాసిన వారు Sirish Praharaju
May 08, 2025
08:33 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి సహా దేశంలోని ఐదు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీల (ఐఐటీలు) విద్యా ప్రమాణాలు, మౌలిక వసతుల సామర్థ్యాన్ని పెంపొందించేందుకు కేంద్ర మంత్రివర్గం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అభివృద్ధికి ఎంపికైన ఐఐటీలు కేరళలోని పాలక్కాడ్, ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్, జమ్ముకశ్మీర్‌లోని జమ్మూ, కర్ణాటకలోని ధార్వాడ్, అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి ఉన్నాయి. 2025-26 విద్యా సంవత్సరంనుంచి 2028-29 మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం ఈ ఐఐటీల అభివృద్ధికి మొత్తం రూ.11,828.79 కోట్లు ఖర్చు చేయనుంది. ఇందులో భాగంగా ప్రొఫెసర్ స్థాయి 130 బోధనా సిబ్బంది పోస్టులకు అనుమతి ఇచ్చింది.

వివరాలు 

నాలుగేళ్ల వ్యవధిలో, అదనపు భవనాలు నిర్మించాలి 

పరిశ్రమలు,విద్యా సంస్థల మధ్య సంబంధాలను మరింత బలపరిచేందుకు ఈ ఐఐటీలలో అత్యాధునిక పరిశోధనా పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ నాలుగేళ్ల వ్యవధిలో, అదనపు భవనాలు నిర్మించి విద్యార్థుల చొప్పున సీట్లను 6,576 మేర పెంచనున్నారు. మొదటి ఏడాది 1,364 సీట్లు, రెండవ ఏడాది 1,738 సీట్లు, మూడవ ఏడాది 1,767 సీట్లు, నాలుగవ సంవత్సరం 1,707 సీట్లు అందుబాటులోకి వస్తాయి. ఫలితంగా, ప్రస్తుతం 7,111 మంది విద్యార్థులు ఉన్న ఈ ఐఐటీల్లో భవిష్యత్తులో మొత్తం 13,687 మంది విద్యార్థులు చేరే అవకాశం ఉంటుంది.

వివరాలు 

వెయ్యి ఐటీఐల ఆధునికీకరణకు భారీ పథకం 

దేశంలో నైపుణ్యాల అభివృద్ధికి ఉద్దేశించిన దిశగా, పారిశ్రామిక శిక్షణ సంస్థలు (ఐటీఐలు) ఆధునికీకరణ కోసం రూపొందించిన జాతీయ స్థాయి పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రాయోజిత నైపుణ్యాభివృద్ధి పథకంలో భాగంగా ఐదు ప్రాంతాల్లో నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ పథకాన్ని రూ.60,000 కోట్ల వ్యయంతో అమలు చేయనున్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.30,000 కోట్లు, రాష్ట్రాలు రూ.20,000 కోట్లు, పరిశ్రమలు రూ.10,000 కోట్లు వాటా రూపంలో సమకూర్చనున్నాయి. మొత్తం వెయ్యి ప్రభుత్వ ఐటీఐలను ఆధునికీకరించి, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కోర్సులను ప్రవేశపెట్టనున్నారు.

వివరాలు 

 20 లక్షల మంది యువతకు నూతన నైపుణ్యాలు 

ఈ విధంగా, వచ్చే ఐదేళ్లలో సుమారు 20 లక్షల మంది యువతకు నూతన నైపుణ్యాలను నేర్పించేందుకు ప్రణాళిక సిద్ధమైంది. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను స్థానిక యువతలో పెంపొందించి వారిని ఉపాధికి అనుకూలంగా తీర్చిదిద్దడమే ఈ పథకానికి ప్రధాన ఉద్దేశంగా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం హైదరాబాద్, భువనేశ్వర్, చెన్నై, కాన్పూర్, లూధియానాలలో ఉన్న నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లలో 50,000 మందికి శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ప్రకటించారు.

వివరాలు 

విద్యుత్‌ కేంద్రాలకు బొగ్గు కేటాయింపుల కోసం 'శక్తి' పథకం 

దేశంలోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు అవసరమైన బొగ్గు సరఫరా కోసం కేంద్ర ప్రభుత్వం సవరించిన 'శక్తి' (Shakti) పథకాన్ని ఆర్థిక వ్యవహారాల కమిటీ బుధవారం ఆమోదించింది. దీని ద్వారా విద్యుత్ రంగానికి తాత్కాలికం మరియు దీర్ఘకాలంలో అవసరమైన బొగ్గు సరఫరా నిరంతరంగా జరిగేలా చేస్తారు. విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు కేటాయింపులను ఈ పథకం ద్వారా మరింత సమర్థవంతంగా నిర్వహించనున్నారు.