LOADING...
Jasprit Bumrah: బుమ్రాపై టీమిండియా మాజీ క్రికెటర్‌ కీలక వ్యాఖ్యలు 
బుమ్రాపై టీమిండియా మాజీ క్రికెటర్‌ కీలక వ్యాఖ్యలు

Jasprit Bumrah: బుమ్రాపై టీమిండియా మాజీ క్రికెటర్‌ కీలక వ్యాఖ్యలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 11, 2025
03:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవ‌ల ముగిసిన టెండూల్కర్-అండర్సన్‌ ట్రోఫీ టెస్ట్‌ సిరీస్‌లో ఇంగ్లండ్‌, భారత జ‌ట్టులు ఐదు మ్యాచ్‌లు ఆడ‌గా, చివ‌రికి సిరీస్‌ 2-2తో సమంగా ముగిసింది. ఈ సిరీస్‌లో భారత ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా వర్క్‌లోడ్‌ కారణంగా కేవలం మూడు టెస్ట్‌ల‌కే పరిమితమ‌య్యాడు. ఆ మూడు మ్యాచ్‌ల్లోనే 14 వికెట్లు తన ఖాతాలో వేసుకొని, రెండు సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించాడు. అయితే దురదృష్టవశాత్తూ, ఆ రెండు టెస్ట్‌ల్లోనూ భారత జట్టు ఓటమి ఎదుర్కొంది.

వివరాలు 

బుమ్రా ఉంటే ఫలితం వేరేలా ఉండేది 

బుమ్రా అన్ని టెస్ట్‌ల్లో ఆడే అవకాశం దొరికితే, భారత్‌ కచ్చితంగా ఈ సిరీస్‌ను గెలుచుకునేదని టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ విశ్లేషించారు. ఆయన మాట్లాడుతూ.. "ఐపీఎల్‌లో చేసిన పరుగులు, తీసుకున్న వికెట్లు ఎవరూ గుర్తుపెట్టుకోరు. కానీ ఈ టెస్ట్‌ సిరీస్‌లో మహ్మద్‌ సిరాజ్‌ పోరాటం,శుభమన్‌ గిల్‌, కేఎల్‌ రాహుల్‌, యశస్వి జైస్వాల్‌, రిషబ్ పంత్‌ బ్యాటింగ్‌, వాషింగ్టన్‌ సుందర్‌ ఆల్‌రౌండ్‌ ఆట.. ఇవన్నీ అభిమానుల మదిలో నిలిచిపోతాయి. బుమ్రా అన్ని మ్యాచ్‌లు ఆడుంటే, భారత్‌ ట్రోఫీని కైవసం చేసుకునేదని నాకు నమ్మకం" అన్నారు.

వివరాలు 

సెలెక్టర్‌గా ఉంటే తీసుకునే నిర్ణయం 

తానే భారత చీఫ్‌ సెలెక్టర్‌ అయితే, బుమ్రా విషయంలో ప్రత్యేక ప్రణాళిక వేసుకునేవాడినని వెంగ్‌సర్కార్‌ తెలిపారు. "నేను సెలెక్టర్‌ అయితే ముంబయి ఇండియన్స్‌ యజమాని ముఖేష్‌ అంబానీతో మాట్లాడి, బుమ్రా ఇంగ్లాండ్‌ సిరీస్‌పై దృష్టి పెట్టేందుకు ఐపీఎల్‌లో ఆడకూడదని లేదా తక్కువ మ్యాచ్‌లు మాత్రమే ఆడాలని ఒప్పించేవాడిని. నా ప్రతిపాదనకు వారు అంగీకరించే అవకాశం ఎక్కువ" అన్నారు.

వివరాలు 

బుమ్రాకి మద్దతు 

సిరీస్‌లో తక్కువ మ్యాచ్‌లు ఆడినందుకు బుమ్రాను ఎవరూ తప్పుపట్టరాదని ఆయన అన్నారు. "అతడు వెన్నుపైన శస్త్రచికిత్స చేయించుకున్నాడు. దేశంపై బుమ్రాకు ఉన్న నిబద్ధతపై సందేహం లేదు. జట్టుకు ప్రతిసారీ తన శక్తి మేరకు ప్రదర్శన ఇస్తాడు. విశ్రాంతి తర్వాత పూర్తిగా ఫిట్‌గా తిరిగి వస్తాడని ఆశిస్తున్నాను" అని వెంగ్‌సర్కార్‌ స్పష్టం చేశారు.

వివరాలు 

గౌతమ్‌ గంభీర్‌-ఓవల్‌ పిచ్‌ వివాదం 

ఓవల్‌ టెస్ట్‌కు ముందు పిచ్‌ క్యూరేటర్‌ లీ ఫోర్టిస్‌,భారత కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ మధ్య వివాదం జరిగిన విషయం తెలిసిందే. దీనిపై ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మ్యాథ్యూ హెడెన్‌ గంభీర్‌ భాషపై విమర్శలు చేశారు. అయితే, ఈ విషయంలో వెంగ్‌సర్కార్‌ గంభీర్‌కు మద్దతు తెలిపారు. "భారత ప్రధాన కోచ్‌గా గంభీర్‌కు పిచ్‌ను పరిశీలించే హక్కు తప్పనిసరిగా ఉంది. భారత్‌లోకి విదేశీ జట్లు వచ్చినప్పుడు వారి కెప్టెన్లు, కోచ్‌లు మాత్రమే కాదు, మొత్తం జట్టే పిచ్‌ పరిస్థితులను పరిశీలిస్తారు. మ్యాచ్‌కు ముందు విదేశీ మీడియా కూడా పిచ్‌ను తనిఖీ చేస్తుంది. అప్పుడు ఎవరూ అభ్యంతరం చెప్పరు. మరి మేము ఇంగ్లాండ్‌లో ఆడుతున్నప్పుడు ఎందుకు రూల్స్‌ మారాలి?" అంటూ వెంగ్‌సర్కార్‌ హెడెన్‌ వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు.