
Earthquake: ఇరాన్లో భూకంపం.. అణుపేలుళ్లు జరిపారా? నిజం ఏంటి?
ఈ వార్తాకథనం ఏంటి
ఇజ్రాయెల్ (Israel) దాడులతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న ఇరాన్లో తాజాగా భూకంపం సంభవించింది. సెమ్నాన్ ప్రాంతంలో 5.2 తీవ్రతతో రికార్డు అయిన ఈ భూకంపం, 10 కి.మీ లోతులో కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. ఇజ్రాయెల్తో ఉద్రిక్తతల సమయంలో, టెహ్రాన్ రహస్యంగా అణుపరీక్షలు జరుపుతూ ఉండవచ్చని కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అంతరిక్ష, క్షిపణి కాంప్లెక్స్ ఉన్న ప్రాంతానికి సమీపంలోనే భూకంపం చోటుచేసుకోవడం ఈ ఊహాగానాలను మరింత బలపరుస్తోంది. సెమ్నాన్ ప్రావిన్స్ లోని అంతరిక్ష కేంద్రం, మిస్సైల్ కాంప్లెక్స్లు రక్షణశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. శనివారం ఉదయం సంభవించిన ఈ భూకంపం కారణంగా ఉత్తర ఇరాన్లోని అనేక ప్రాంతాలు ప్రకంపనలకు లోనయినట్టు సమాచారం.
Details
ఇరాన్ భూకంప ముప్పుకు కేంద్రం ఎందుకు?
ఇరాన్ భూకంప ముప్పు అధికంగా ఉన్న దేశం. అరేబియన్, యురేషియన్ టెక్టోనిక్ ప్లేట్లు కలిసే ఆల్పైన్-హిమాలయన్ సెస్మిక్ బెల్టులో ఉండటమే కారణం. ఏటా ఇరాన్లో సుమారు 2,000కుపైగా భూకంపాలు నమోదు అవుతుంటాయి. వీటిలో 15-16 భూకంపాలు రిక్టర్ స్కేల్ పై 5కంటే ఎక్కువ తీవ్రతతో ఉంటాయి. 2006-2015 మధ్య ఇరాన్లో సుమారు 96,000 భూకంపాలు సంభవించినట్టు అంచనాలు చెబుతున్నాయి.
Details
భూకంపం అణుపరీక్షా?
అణ్వాయుధ కార్యక్రమాల సమయంలో భూగర్భ పేలుళ్లు తీవ్రమైన ప్రకంపనలకు కారణం కావచ్చు. అణుపేలుళ్లు సంభవించే ప్రదేశంలో టెక్టోనిక్ ప్లేట్లపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఇది అణుపరీక్షా? లేక సహజ భూకంపమా? అనేది తరంగాలను విశ్లేషించడం ద్వారా మాత్రమే నిర్ణయించగలం. తాజాగా భూకంప శాస్త్రవేత్తలు అణుపరీక్షల వాదనను కొట్టిపారేశారు. పది కి.మీ లోతులో అణుపరీక్షలు జరగవని, అది భౌగోళికంగా అసాధ్యమని కొంతమంది నిపుణులు ఇరాన్ మీడియా కథనాల ద్వారా తెలిపారు.