
India on Tariffs: ట్రంప్ టారిఫ్ల వేళ.. వస్త్ర ఎగుమతులను పెంచడానికి భారత్ 40 దేశాల్లో ప్రత్యేక ప్రోగ్రామ్లు..!
ఈ వార్తాకథనం ఏంటి
రష్యా నుంచి చమురు దిగుమతి కొనసాగిస్తోందన్న కారణంతో, భారతదేశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 50 శాతం అదనపు సుంకాలు బుధవారం నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ కొత్త టారిఫ్లు అమలులోకి రావడంతో, భారత్ నుంచి ఎగుమతి అవుతున్న జౌళి ఉత్పత్తులు, రెడీమేడ్ దుస్తులు, విలువైన రాళ్లు (జెమ్స్), బంగారు-వెండి ఆభరణాలు వంటి విభాగాలపై తక్షణ ప్రభావం పడనుందని నిపుణులు చెబుతున్నారు. ఎగుమతులపై పడబోయే ఈ ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టినట్లు సమాచారం. ముఖ్యంగా టెక్స్టైల్ రంగం ఎగుమతులను మరింతగా పెంపొందించడానికి ప్రత్యామ్నాయ ప్రణాళిక (కౌంటర్ ప్లాన్) సిద్ధం చేసినట్లు తెలిసింది.
వివరాలు
ఈ దేశాల్లో మన ఉత్పత్తులకు మార్కెట్ను విస్తరించేలాప్రోగ్రామ్లు
ఈ క్రమంలో 40 దేశాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. యునైటెడ్ కింగ్డమ్, జపాన్, దక్షిణ కొరియా, జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్, నెదర్లాండ్స్, పోలాండ్, కెనడా, మెక్సికో, రష్యా, బెల్జియం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియా వంటి ముఖ్య దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ దేశాల్లో జరగబోయే ప్రత్యేక ప్రోగ్రామ్ల ద్వారా భారత ఉత్పత్తుల మార్కెట్ను విస్తరించడమే కాకుండా, కొత్త అవకాశాలను సృష్టించే దిశగా చర్యలు కొనసాగనున్నాయని అధికారిక వర్గాలు వెల్లడించాయి.